స్పైస్జెట్ సంస్థ విమానాల్లో పదే పదే తలెత్తిన అవాంతరాలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది. తన విమానాలను 50శాతానికి కుదిస్తూ పర్మిషన్ ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ తన సంస్థకు చెందిన విమానాలను 50శాతానికి మించకుండా నడుపుతోంది. అయితే.. ఇంకా ఆ సంస్థ తన తప్పులను సరిదిద్దుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న (శనివారం) రాత్రి స్పైస్జెట్ కు చెందిన హైదరాబాద్-ఢిల్లీ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఈ ఘటన మరోసారి జరగింది.
విమానం దిగిన ప్రయాణికులను విమానాశ్రయంలోని టెర్మినల్కు బస్ ద్వారా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ, దాదాపు 45 నిమిషాలు వెయిట్ చేసినా ఎట్లాంటి వేహికల్ రాకపోవడంతో విసిగిపోయిన ప్రయాణికులు నడకదారిపట్టారు. ఇట్లా టార్మాక్పై నడుస్తూ టెర్మినల్కు బయలుదేరారు. ఎందుకంటే వారిని టెర్మినల్కు తీసుకెళ్లడానికి ఎయిర్లైన్ సుమారు 45 నిమిషాల పాటు బస్సును అందించలేకపోయిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) దర్యాప్తు చేస్తోందని సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. అయితే.. కోచ్లు రావడంలో కొద్దిసేపు ఆలస్యమైందని, బస్సులు వచ్చిన తర్వాత నడుస్తూ వెళ్తున్న వారితో సహా ప్రయాణికులందరూ టార్మాక్ నుండి టెర్మినల్ భవనం వరకు ప్రయాణించారని స్పైస్జెట్ తెలిపింది. “మా సిబ్బంది పదే పదే అభ్యర్థన చేసినప్పటికీ కొంతమంది ప్రయాణికులు టెర్మినల్ వైపు నడవడం ప్రారంభించారు. కోచ్లు వచ్చేసరికి వారు కొంత దూరం నడిచారు. భద్రతా ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలోని టార్మాక్ ప్రాంతంలో నడవడానికి అనుమతించరు. వాహనాల ద్వారా మాత్రమే వారిని టెర్మినల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది”అని స్పైస్ జెట్ ప్రతినిధులు తెలిపారు.
కానీ, కొంతమంది ప్రయాణికులు చెప్పేదేమిటంటే..‘‘186 మంది ప్రయాణికులతో స్పైస్జెట్ హైదరాబాద్-ఢిల్లీ విమానం శనివారం రాత్రి 11.24 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది. అప్పుడు కొంతమందిని తీసుకెళ్లడానికి ఒక బస్సు వచ్చింది. ప్రయాణికులలో కొంతమంది టెర్మినల్ 3కి వెళ్లారు. కానీ, ఆ తర్వాత మిగతా ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఎట్లాంటి వాహనం రాలేదు. మిగతా ప్రయాణికులు దాదాపు 45 నిమిషాల పాటు వేచి ఉన్నారు.
వారి కోసం ఎటువంటి బస్సు రాకపోవడంతో వారు దాదాపు 1.5 కి.మీ దూరంలో ఉన్న టెర్మినల్ వైపు నడుస్తూ వెళ్లారు. ఆ తర్వాత దాదాపు 12.20నిమిషాలకు మరో బస్సు వచ్చింది’’ అని కొంతమంది ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటన గురించి స్పైస్జెట్ని ప్రశ్నించగా అదంతా తప్పుడు సమాచారమని, కావాలనే కొంతమంది స్పైస్జెట్పై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారని అధికారులు కొట్టిపారేశారు. అయితే.. ఈ ఘటనను డీజీసీఏ సీరియస్గా తీసుకుంది. దీనిపై ఎంక్వైరీ చేపట్టినట్టు తెలుస్తోంది.