హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరువు రక్కసికోరల్లో వివిలలాడిన పాలమూరు క్రమేణ ఊపిరిపీల్చుకుంటోంది. చుట్టూ కృష్ణా, తంగభద్ర వంటి నదులున్నా గుక్కెడు నీళ్లకోసం తహతహలాడిన పాలమూరు పచ్చబడుతోంది. ఆరు దశాబ్దాల కాలగమనంలో వివక్షకు గురైన జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరించి సామర్ధ్యం పెంచడంతో క్రమేణ సాగునీరు పంటపొలాల్లో పరవల్లు తొక్కుతోంది. నడిగడ్డగా ప్రసిద్ది చెందిన గద్వాల, అలంపూర్ చుట్టూ కృష్ణ, తుంగభద్ర నదులున్నప్పటికీ ఎగువప్రాంతానికి నీరు ఎత్తిపోసే వ్యవస్థలేక తల్లడిల్లిన ఈ నేలలో రాజీవ్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సామర్ధ్యంపెంచి కరువుపీడిత ప్రాంతాలకు నీరు అందించేందుకు చేపట్టిన పనులు దాదపు పూర్తి అయ్యాయి.
ఎగువతీరం నుంచి 21.425 టీఎంసీ నీటిని ఎత్తిపోసి 2లక్షల ఎకరాలకు సాగునీరు, జోగులాంబ గద్వాల్, అలంపూర్ నియోజక వర్గంలోని 8మండలాల్లోని148 గ్రామాలకు సాగునీరు అందించడంతో పాటు.. జోగులాంబ జిల్లాలోని మార్గ మధ్యంలోని గ్రామాలకు కాలువ వ్యవస్థ ద్వారా తాగునీటి సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కలిపించి గత సమైక్యపాలకుల వివక్షతకు చమరగీతం పాడింది. అయితే.. జవహర్ లాల్ నెహ్రూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు దశలున్నాయి. అప్రోఛానల్, ప్రెజర్ మేన్ టన్నెల్ తో పంపింగ్ వ్యవస్థ.. ఆన్ లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో కలిగిన గూడెందొడ్డి గ్రామంలో 1వ ఎత్తిపోతల, రేలంపాడు గ్రామంలో 2వ ఎత్తిపోతల ప్రతిపాదించి పనులు పూర్తి చేశారు.
ఇక.. నెట్టెంపాడు ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో పంపులు ట్రయిల్ రన్ పూర్తి చేసుకుని వానాకాలం సీజన్ కు సాగునీరు అందించేందుకు సిద్ధమయ్యాయి.ప్రస్తుత వేసవిలో ప్రాజెక్టులోని నీటితో ఇప్పటికే 110 చిన్ననీటి చెరువులను 0.875 టీఎంసీల నీటితో నింపేశారు. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో ప్రస్తుత వర్షాకాలంలో పూర్తి స్థాయి నీటి మట్టాలతో లక్ష్యం చేరుకోనుంది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటివరకురూ. 23కోట్ల 72లక్షల 34 వేలు ఖర్చుఅయ్యాయి. 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన కెనాల్స్, పంటకాలువలు పూర్తి అయ్యాయి.
కాగా, మరో 58 ఎకరాలకు నీరు అందించే అవకాశాలున్నట్లు అధికారులు చెపుతున్నారు. గత ప్రభుత్వాలు మొక్కుబడిగా ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు మొబలైజేషన్ అడ్వాన్స్ లకే పరిమితం కావడంతో కరువుజిల్లా పాలమూరులో ఉపాధిని వెతుకుంటూ వలసలు వెళ్లారు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ చేసి నిర్మించడంతో పాలమూరు బతుకులు పచ్చబడుతున్నాయి. దీంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి కూలీలు మహబూబ్ నగర్ జిల్లాకు పనులకోసం వలస వస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.