ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి పెద్ద మొత్తంలో తరలిస్తున్న హెరాయిన్ షిప్మెంట్ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ను భారత్, శ్రీలంకలో అమ్మడానికి ఒక ఇరానియన్ బోటులో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు 1200 కోట్ల విలువ ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీలంక బోటులోకి డ్రగ్స్ను తరలించే క్రమంలో పట్టుకున్నారు. అయితే.. కాస్త లేట్ అయితే ఆ బోటును ట్రేస్ చేయడం తమకు కష్టంగా ఉండేదని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తెలిపారు.
భారత నేవీతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టిన ఎన్సీబీ అధికారులు.. డ్రగ్స్ షిప్మెంట్ను క్రాక్ చేశారు. ఈ మొత్తాన్ని కేరళలోని కోచి తీరానికి తీసుకొచ్చారు. అలాగే ఆరుగురు ఇరానియన్ దేశస్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ డ్రగ్స్ ముందుగా పాకిస్తాన్ వెళ్లాయని, అక్కడ ఇరానియన్ బోటులో ఎక్కించి భారత్ తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ ప్యాకెట్లపై ఉన్న గుర్తులు, ప్యాకింగ్ విధానం ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్లోనే జరుగిందని తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. దాదాపు రూ.1200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.