Thursday, April 25, 2024

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటి నుంచి తీసుకెళ్లాడో యువ‌కుడు.. ఆపై ఆ యువ‌తిని మోసం చేయడంతో తట్టుకోలేక‌పోయింది. దీంతో మ‌న‌స్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు తన వేదనను సెల్ఫీ వీడియో ద్వారా రికార్డు చేసి షేర్ చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్‌లో ఈ ఘ‌ట‌న జరిగింది. స్థానిక షంషీర్ నగర్‌కు చెందిన తేజశ్రీ, నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లిన రాజ్‌కుమార్ ఆమెను ఓ చోట ఉంచాడు.

అయితే, ఆ తర్వాత అతడు పెళ్లి ఊసెత్తకపోగా, తప్పించుకు తిరుగుతుండడంతో తాను మోసపోయానని గ్రహించింది. మనస్తాపంతో పురుగుల మందు తాగి తన ఊరైన లంబాడితండాకు ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే ఆమెను స్థానిక పీహెచ్‌సీ సెంటర్‌కు తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు.

అక్కడ చికిత్స పొందుతూ యువతి చ‌నిపోయింది. తాజాగా, ఆమె సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. రాజ్‌కుమార్‌ను నమ్మి అందరినీ వదిలేసి ఇంటి నుంచి వచ్చేశానని, ఇప్పుడు అతడు తప్పించుకుని తిరుగుతున్నాడని, ఇక తనకు దిక్కెవరని సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. తనకు అన్యాయం జరిగిందని వాపోయింది. దీనిపై కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement