Sunday, May 5, 2024

పోలవరంతో తెలంగాణకు ముంపు ఉండదు: ఏపీ

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ముంపు ఉండదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పాల్గొన్న జల వనరుల శాఖ ఇంజినీర్లు….తెలంగాణ అభ్యంతరాలకు సమాధానమిచ్చారు. ముంపుపై సంయుక్త సర్వే నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ అయ్యర్ నిన్న వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పాల్గొన్నారు. అలాగే, కేంద్ర జలసంఘం నుంచి చీఫ్ ఇంజినీర్, కేంద్ర అటవీ పర్యాటకశాఖ అధికారి పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందంటూ ఎన్‌జీటీలో కేసు దాఖలు అయింది. దీంతో ఈ విషయమై తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఎన్‌జీటీ కోరిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో తెలగాంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి ఏపీ అధికారులు సమాధానం ఇచ్చారు. ఏప్రిల్‌ 15 నుంచి 29 వరకు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు కలిసి సంయుక్త సర్వే చేశారని, ఆ నివేదిక కేంద్ర జలసంఘానికి సమర్పిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును డ్యాం భద్రత దృష్ట్యానే 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి అనువుగా నిర్మిస్తున్నామని, ఇంతవరకు నది చరిత్రలో ఎన్నడూ అంత వరద వచ్చిన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి తెలంగాణకు ముప్పు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును 2022 ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నందున ఆ లోపులోనే పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ సూచించారు. పోలవరంలో డ్యాం ఎత్తు 45.72 మీటర్ల స్థాయికి అవసరమైన పునరావాస, భూసేకరణ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement