Monday, April 29, 2024

ఘ‌నంగా అంతర్జాతీయ యోగా డే.. మైసూరులో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ

దేశవ్యాప్తంగా జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జ‌రుగుతోంది. 75 నగరాల్లో వేడుకలు జరుగుతుండగా.. కర్నాటక రాష్ట్రం మైసూరులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన యోగా దినోత్సవ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పాల్గొని ఆసనాలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో సీఎం​ కేజ్రీవాల్​, ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, రిషికేశ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్​ ధామి పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

ఇక‌.. మైసూర్‌లో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. అందరిదన్నారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందన్నారు.

దేశ‌ ప్రత్యేకత, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింభిస్తుందని, కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుందన్నారు. యోగా దినోత్సవం అనేది ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అన్నారు. కొన్నేళ్ల క్రితం ఇండ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని, ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement