Saturday, May 18, 2024

ములాయం సింగ్​ యాదవ్​ అంత్యక్రియలు ఇవ్వాలే.. యూపీ వెళ్లనున్న సీఎం కేసీఆర్​!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్​ మాజీ సీఎం  ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఇవ్వాల జరగనున్నాయి. అతని పార్ధివదేహాన్ని స్వగ్రామం సైఫాయికి తీసుకొచ్చారు. దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో సైఫాయిలో ‘నేతాజీ అమర్ రహే’ వంటి స్లోగన్స్​ మిన్నంటాయి. మూడుసార్లు  యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన నిన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయారు. సాయంత్రం అతని భౌతికకాయం సైఫాయ్ గ్రామానికి చేరుకుంది. కాగా, ఇవ్వాల మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. ములాయం అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. దీనికోసం  భారీగా ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి సోమవారం ములాయం పార్ధివదేహానికి నివాళులర్పించారు. అఖిలేష్ యాదవ్‌కు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్​, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఇవ్వాల నివాళులర్పించేందుకు రానున్నారు.ములాయం సింగ్ యాదవ్ కుమారుడు,  సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్.. ఇతర కుటుంబ సభ్యులు సైఫాయ్ గ్రామంలోనే ఉన్నారు.

ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులు అర్పించేందుకు వీవీఐపీలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామానికి చేరుకోవడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి 9:30 గంటల వరకు సుమారు 10,000 మంది ప్రజలు తుది నివాళులు అర్పించినట్లు క్యూ  నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అధికారి అంచనా వేశారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మూడు రోజులపాటు సంతాపదినాలుగా సెలవు ప్రకటించింది. ములాయం సింగ్ యాదవ్ (82) దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం 8:16 గంటలకు మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement