Thursday, April 18, 2024

సొంతింటి కల… ఇక ‘డబుల్’ స్పీడ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పేదల సొంతింటి కలను నిజం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 2018 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో అత్యంత ప్రధానమైనది కావడం తో, ”డబుల్‌ బెడ్‌రూం” పథకం ఇళ్ళను ఈ ఏడాది ఆఖరు నాటికి పంపిణీ చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అలాగే 2023-24 వార్షిక బడ్జెట్‌ లో ప్రభుత్వం వెల్లడించిన ”స్థలముంటే రూ.3 లక్షలు” పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభిం చింది. ఈ మేరకు ఇళ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉప సంఘం సోమవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. బీఆర్కే భవన్‌లో మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరి గింది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయండంతో పాటు ఇళ్ల స్థలాలు, నిరుపేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీ కరణ సహా సంబంధిత అంశాలన్నింటిపై ఈ భేటీ-లో చర్చించారు. మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తదితరులు ఈ సమా వేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో 2023-24 వార్షిక సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం సొంత స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.7,350 కోట్లు- కేటాయించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన ప్రతి కుటు-ంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ ఏడాది ఆఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి హామీని నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

అలాగే వచ్చే ఏడాదికి డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద గృహాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు- ప్రభుత్వం శాసనసభకు వెల్లడించిన నేపథ్యంలో ఆ ప్రక్రియను వచ్చే నెలలో మొదలుపెట్టాలని ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వం ఇంతవరకు 2.75 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేయగా దాదాపు 1.37 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 53,984 ఇళ్ల నిర్మాణం 90శాతం పూర్తి కాగా మిగతావి నిర్మాణదశలో ఉన్నాయి. లబ్ధిదారుల వాటా లేకుండా ప్రభుత్వమే పూర్తి నిధులు వెచ్చించి చేస్తున్న నిర్మాణాలు వేగంగా పూర్తిచేసి అందించనున్నట్లు- ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించేందుకు సాంకేతిక సహాయాన్ని తీసుకోనున్నామని, ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణాల్లో లబ్ధిదారులుగా ఎంపి-కై-న వారు దరఖాస్తుదారుల్లో ఉంటే వారిని తొలగించి, ఏ పథకం కింద లబ్ధి పొందని వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు- తెలిపింది.

మొదటి దశలో 4 లక్షల మందికి ఇళ్ళ సాయం
సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం 2023-24లో 4 లక్షల మంది వరకు లబ్ధిదారులకు సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి ఆర్థికసాయం అందించడానికి నిర్ణయించింది. కరోనా తదితర కారణాలతో రెండేళ్లుగా గృహనిర్మాణాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి పీఎంజీఎస్‌వై గ్రామీణ, పట్టణ, డబుల్‌ బెడ్‌రూమ్‌, సొంత జాగాల్లో గృహాల పథకం కింద మొత్తం 5.35 లక్షల ఇళ్లకు లక్ష్యం పెట్టుకుంది.
నిధుల మంజూరు అధికారం కలెక్టర్లకే
డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు బాధ్యతలు ఇవ్వడంతో పాటు- రూ.150 కోట్ల వరకు పరిపాలన మంజూరు అధికారాన్ని అప్పగించింది. ఈ పథకం కోసం బస్తా సిమెంటు- రూ.230కే ఇచ్చేలా ఇప్పటికే సిమెంటు- కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో గుత్తేదారులు ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలుగా ఈఎండీ మొత్తాన్ని 2.5 శాతం నుంచి ఒక శాతానికి, ఎఫ్‌ఎస్‌డీ మొత్తాన్ని 7.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.

లబ్ధిదారుల ఎంపికకు జిల్లా స్థాయి కమిటీ
”స్థలముంటే రూ.3 లక్షలు” పథకంలో లబ్ధిదారుల ఎంపిక కోసం మంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో జిల్లా స్థాయి కమిటీ-ని ఏర్పాటు- చేసి, ఈ కమిటీ-కి కన్వీనర్‌గా కలెక్టరును నియమించింది. గ్రామస్థాయిలో దరఖాస్తులు తీసుకుని గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తోంది. గ్రామసభలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాలను తహశీల్దార్లు కలెక్టర్లకు పంపితే ఆ జాబితాలకు షెడ్యూలు ప్రకారం లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జీహెచ్‌ఎంసీకి వెలుపల చేపట్టిన ఇళ్లలో నియోజకవర్గానికి 10శాతం లేదా వెయ్యి ఇళ్లు ఇందులో ఏది తక్కువైతే ఆ మొత్తంలో స్థానిక లబ్ధిదారులకు రిజర్వ్‌ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement