Sunday, April 28, 2024

95 శాతం మందికి వైరస్ లక్షణాలు లేవు: ఈటల

తెలంగాణకు సరిపడా టీకా డోసులు కేంద్ర ప్ర‌భుత్వం పంపుతుందని ఆశిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టీకాలు లేక ఈ రోజు వ్యాక్సినేష‌న్ నిలిచిపోయింద‌న్నారు. ఈ రోజు రాత్రికి 2.7 ల‌క్ష‌ల టీకాలు రాష్ట్రానికి వ‌స్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బాధితుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. వైర‌స్ సోకిన 3-4 రోజుల‌కు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని, ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డంతోనే ఒక‌రి నుంచి క‌రోనా మ‌రొక‌రికి త్వ‌ర‌గా వ్యాపిస్తోంద‌న్నారు.

తెలంగాణలోని ఆసుప‌త్రుల్లో బెడ్స్ కొరత లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఐదు ఆసుప‌త్రుల్లోనే బెడ్లు నిండిపోయాయని, ఇంకా 60 వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమలకు సరఫరా తగ్గించి ఆరోగ్య రంగానికి కేటాయించాలని అధికారులను ఆదేశించామ‌ని మంత్రి ఈటల వివ‌రించారు. ఆక్సిజన్ ఉత్పత్తి అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోలేవని తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ లేక‌ కర్ఫ్యూ విధించే అవకాశాలు లేవ‌ని స్పష్టం చేశారు. అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌లను పాటించాల‌ని మంత్రి ఈటల కోరారు.

రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, 25 ఏళ్లకు పైగా ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు. ఉత్పత్తిని బట్టి, రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందన్నారు. వ్యాక్సిన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. రెమిడిసివిర్ ఉత్పత్తి చేసే యాజమాన్యాలతో మాట్లాడామని, రేపటి నుంచి రెమిడిసివిర్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లంచారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా రేమిడిసివిర్ అందుబాటులో ఉంచుతామని మంత్రి ఈటల చెప్పారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement