Friday, May 3, 2024

పరీక్షలు రాయకపోతే కరోనా రాదా?: మంత్రి ఆదిమూలపు సురేష్

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని… త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఉన్నత చదువుల కోసం టెన్త్, ఇంటర్ పరీక్షలు చాలా అవసరమని.. విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా తాము కోరినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

టెన్త్ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని.. తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.స్వీయ నియంత్రణతో కరోనా నుండి కాపాడుకో వచ్చన్నారు. ఉపాధ్యాయులు కూడా కరోనాకు ప్రాణాలు కోల్పోయారన్నారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్‌కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. టీడీపీ మొండి వైఖరితో ముందుకు వెళుతుందని విమర్శించారు. వాస్తవాలను వాస్తవంగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉందన్నారు. లోకేష్ ఏం సాధించాలని పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారని ప్రశ్నించారు. పరీక్షలు రాయకపోతే ఏమైనా కరోనా రాదని గ్యారెంటీ ఉందా అని మంత్రి సురేష్ నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement