Friday, April 26, 2024

వార‌ణాసి పేలుళ్ల కేసులో కీల‌క దోషి.. వ‌లీవుల్లాకు మ‌ర‌ణ‌శిక్ష విధించిన కోర్టు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వార‌ణాసిలో 2006లో జరిగిన వరుస పేలుళ్ల‌ కేసులో దోషిగా ఉన్న వ‌లీవుల్లా ఖాన్‌కు కోర్టు మరణ శిక్ష విధించింది. వారణాసి పేలుళ్ల కేసు ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. 2006 మార్చి 7వ తేదీన సంకట్ మోచన్ ఆలయం, కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లలో జరిగిన పేలుళ్లలో దాదాపు 20 మంది మరణించారు. మరో 100 మంది దాకా గాయపడ్డారు. ఘజియాబాద్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ సిన్హా వలీవుల్లాను దోషిగా నిర్ధారించారు. రెండు కేసుల్లో హత్యా, హత్యాయత్నం పేలుడు పదార్ధాల చట్టం కింద కేసులు పెట్టారు. ఒక కేసులో వలీవుల్లాను నిర్ధోషిగా కోర్టు పేర్కొంది. 2006 మార్చి 6న సంకట్ మోచక్ ఆలయంలో మొదటి పేలుడు జ‌రిగింది.

ఈ ఘటన జరిగిన 15 నిమిషాల తర్వాత కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ క్లాస్ రిటైరింగ్ రూమ్ వెలుపల మ‌రో పేలుడు జ‌రిగింది. ఆ తర్వాత దశాశ్వమేద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ రెయిలింగ్ వద్ద కుక్కర్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ పేలుళ్ల తర్వాత యూపీ ప్రయాగ్ రాజ్ లోని పూల్ పూర్ కు చెందిన మహ్మద్ వలీవుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. వలీవుల్లా తరపున వాదించడానికి వారణాసి న్యాయవాదులు నిరాకరించారు. ఈ పేలుళ్ల కేసును విచారిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. బంగ్లాదేశ్ కి చెందిన ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జెహాద్ అల్ ఇస్లామీతో వలీవుల్లాకు సంబంధం ఉందని గుర్తించింది. ఈ పేలుళ్లకు వలీవుల్లా కీల‌క సూత్రధారి అని గుర్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement