Monday, April 29, 2024

MLC Election: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ షురూ

తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్‌ జరు‌గు‌తుం‌న్నది. పోలింగ్‌ ప్రక్రి‌యను వెబ్‌‌క్యా‌స్టింగ్‌ చేస్తున్నారు. సాయంత్రం 4 వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 37 పోలింగ్‌ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని‌యో‌గిం‌చు‌కోనున్నారు.

9 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబ్‌నగర్ జిల్లాలో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు సహా వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కోస్థానానికి, కరీంనగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతోంది. పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.

ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ నుంచి దండె విఠల్ బరిలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు పోటీ చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో ఒక స్థానానికి ముగ్గురు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా యాదవరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక, ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ తరపున తాతా మధు, కాంగ్రెస్‌ నుంచి రాయల నాగేశ్వరరావు సహా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్ఎష్ కు చెందిన భాను ప్రసాదరావు, ఎల్​.రమణతో పాటు మరో 8 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ స్వతంత్రుడిగా పోటీ చేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement