Friday, May 3, 2024

కంగ‌నా విలాస‌వంత‌మైన బిచ్చ‌గ‌త్తె: సీపీఐ నారాయ‌ణ ఫైర్

ఇండియాకి 1947లో స్వాతంత్య్రం రాలేద‌ని.. అప్పుడు తెల్లోళ్లు (ఇంగ్లిష్ పీపుల్‌) భిక్ష‌మేశార‌ని కామెంట్ చేసింది బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌.. అస‌లైన స్వాతంత్య్రం 2014లో ప్ర‌ధాని మోడీ అధికారంలోకి వ‌చ్చాక వ‌చ్చింద‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.. స్వాతంత్య్ర పోరాటాన్ని, స‌మ‌ర‌యోధుల స్ఫూర్తిని దెబ్బ‌తీసేలీ కంగనా మాట్లాడింద‌ని చాలామంది ఫైర్ అవుతున్నారు.

కాగా.. బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌ ( Kangana Ranaut )పై సీపీఐ సీనియ‌ర్ నాయ‌కులు నారాయ‌ణ (CPI Narayana ) మండిప‌డ్డారు. భార‌త‌దేశానికి 2014లో స్వాతంత్య్రం వ‌చ్చింది.. 1947లో రాలేదు.. అది భిక్షం అని కంగ‌నా వ్యాఖ్యానించ‌డంపై భ‌గ్గుమ‌న్నారాయ‌న‌. ఓ జాతీయ స్థాయి న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో కంగ‌నా ఈ వ్యాఖ్య‌లు చేశారు. కంగ‌నా వ్యాఖ్య‌ల‌ను బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీతో పాటు ప‌లువురు నాయ‌కులు త‌ప్పుబట్టారు. నెటిజ‌న్లు కూడా ఆమెపై ఫైర్ అవుతున్నారు.

సీపీఐ నారాయ‌ణ వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే..
‘విలాస‌వంత‌మైన యాచ‌కురాలు ఎవ‌రైనా ఉన్నారంటే ఇటీవ‌ల ప‌ద్మ‌శ్రీ అవార్డు తీసుకున్న కంగ‌నా ర‌నౌత్. ఆమె సినిమా యాక్ట‌ర్. క‌ళాకారిణి. క‌ళామాత‌ల్లికి సేవ చేస్తోంది సంతోషమే. ప‌ద్మ‌శ్రీ అవార్డు ఇచ్చారు.. ఎందుకు ఇచ్చారు అర్థ‌మైంది. స్వాతంత్య్రం పోరాటం గురించి ఆమెకూ తెలియ‌దు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల‌కూ అస‌లు తెలియ‌దు. వాళ్ల చేత పద్మ‌శ్రీ అవార్డు పొందిన‌టువంటి కంగ‌నా ర‌నౌత్.. 1947లో స్వాతంత్య్రం భిక్ష అని, అస‌లు స్వాతంత్య్రం కాదు అని, బీజేపీ వ‌చ్చిన త‌ర్వాత 2014లో స్వాతంత్య్రం వ‌చ్చింద‌ని చెప్ప‌డమంటే ఇంత క‌న్నా బానిస‌త్వం ఉండ‌దు.

నువ్వు అడుక్కుతింటున్నావ్.. అడుక్కో.. యాచ‌కురాలిగా అడుక్కో.. నాకేం అభ్యంత‌రం లేదు. నీకు భిక్ష ఆర్ఎస్ఎస్ పెడితే.. దాన్ని స్వాతంత్య్ర‌ పోరాటంతో పోలుస్తావా? స్వాతంత్య్ర‌ పోరాటం గురించి మాట్లాడే అర్హ‌త నీకు, నీకు ప‌ద్మ‌శ్రీ ఇచ్చిన ఆ ప్ర‌భుత్వానికి కూడా లేదు. కంగ‌నా ర‌నౌత్ విలాస‌వంతమైన బిచ్చ‌గ‌త్తె. కుష్ఠురోగుల‌ను మించిన రోగిష్టి కంగ‌నా ర‌నౌత్. ఆమె వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. స‌మాజానికి ఆమె క్ష‌మాప‌ణ చెప్పాలి. లేక‌పోతే నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం ఖాయం’ అని సీపీఐ నారాయ‌ణ అన్నారు. కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కూడా సీరియ‌స్ అయ్యారు. దేశ పౌరుల‌కు, స్వాతంత్య్ర పోరాట యోధుల‌కు క్ష‌మాపణ చెప్పాల‌ని, ముమ్మాటికీ ఇది దేశ ద్రోహ‌మేన‌ని మండిప‌డ్డారు వ‌రుణ్ గాంధీ.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement