– ఆంధ్రప్రభతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
సుప్రీంకోర్టు స్టే సమాచారం అందగానే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఇవ్వాల (సోమవారం) ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల నుండి ఏ శక్తి తనను దూరం చేయలేదని కంటతడి పెట్టుకున్నారు. 40 ఏళ్లుగా కొత్తగూడెం ప్రజల కోసం తాను అహోరాత్రులు శ్రమించానని, వారు కూడా తనను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని అన్నారు. ఇవ్వాల (సోమవారం) సుప్రీంకోర్టు స్టే ప్రకటించగానే ‘ఆంధ్రప్రభ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ హైకోర్టు తనను అనర్హుడిగా పేర్కొంటూ తీర్పు ఇవ్వగా వనమా సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/08/vanama-001-682x1024.webp)
బీసీ నేతనైన తనపై ఎన్నో కుట్రలు జరిగాయని , కష్టం వచ్చిన ప్రతి సారి నియోజక వర్గ ప్రజలు, -అభిమానులు .. తనకు అండగా నిలిచారని అయన భావోద్వేగంతో కృతజ్ణతలు తెలిపారు. తన తుది శ్వాస వరకు కొత్తగూడెం నియోజక వర్గ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు.
కొత్తగూడెం గడ్డపై.. అక్కడి ప్రజల ఒడిలో ఆనందంగా తుదిశ్వాస వదులుతానని అన్నారు. ప్రజాస్వామ్యం మీద -న్యాయస్థానాల మీద మొుదటి నుండి తాను సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నానని , ఈ రోజు తన నమ్మకం గెలిచిందని వనమా సంతోషం వ్యక్తం చేశారు. తనపై కుట్ర, -కుతంత్రాలు.. చీకటి రాజకీయం జరిగిన ప్రతి సారి.. ముఖ్యమంత్రి, -జాతిపిత దైవ సమానుడైన కేసీఆర్ -తనకు అండగా నిలబడ్డారని చెప్పారు. జన్మ జన్మలకు వారికి కృతజ్ణత కలిగిఉంటానని అన్నారు. అలాగే యువనేత, మంత్రి కేటీఆర్ దీవెన కూడా తాను మరవనని కృతజ్ణతలు తెలిపారు.
వనమా ఇంట సంబురాలు..
సుప్రీం కోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించడంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. నినాదాలు చేస్తూ హంగామా చేశారు. వనమాకు న్యాయమే జరిగిందని, కుట్రలు, కుతంత్రాలు చేసి ఎవరూ బాగుపడరని చాలామంది నినాదాలు చేశారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-07-at-2.48.58-PM-1024x576.webp)