Sunday, April 28, 2024

బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తోన్న భారత్.. ప్ర‌ధాని మోడీ

ప్ర‌జ‌లు..దేశాలు త‌మ ప్ర‌యోజ‌నాలతో పాటు ప్ర‌పంచ ప్ర‌యోజ‌నాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. యుద్ధం, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత తీవ్రవాదం, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని, ఈ సమస్యలకు బుద్ధుడి ఆలోచనలు, బోధనలు పరిష్కారం చూపుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ రాజధానిలో నిర్వహిస్తున్న ప్రపంచ బౌద్ధ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు, వనరులు లేని దేశాల గురించి ప్రపంచం ఆలోచించాల్సి ఉంటుందన్నారు. బుద్ధుడు చూపిన మార్గాన్ని భారత్ అనుసరిస్తోందని అన్నారు. భూకంపం వచ్చిన తర్వాత తుర్కియేతో పాటు ఇతరులకు సహాయం అందించిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రతీ మనిషి బాధను తమదిగా పరిగణిస్తున్నామన్నారు.

బుద్ధుని భావాలను ప్రచారం చేయడానికి, గుజరాత్ లోని తన జన్మస్థలం, తన లోక్ సభ నియోజకవర్గం వారణాసితో బౌద్ధమతానికి ఉన్న లోతైన సంబంధాలను చాటి చెప్పేందుకు తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నేడు, రేపు ఈ సదస్సును నిర్వహిస్తోంది. ‘సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందనలు: ఫిలాసఫీ టు ప్రాక్సిస్’ అనే ఇతివృత్తంతో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా టిబెటన్ బౌద్ధమతంపై ప్రముఖ అమెరికన్ నిపుణుడు ప్రొఫెసర్ రాబర్ట్ థర్మన్, వియత్నాం బౌద్ధ సంఘం డిప్యూటీ ప్యాట్రియార్క్ థిచ్ ట్రి క్వాంగ్ ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా పాల్గొంటున్నారు. భారతదేశ పురాతన బౌద్ధ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేసిన కృషికి ప్రొఫెసర్ థర్మన్ కు 2020 లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందించింది. బౌద్ధ, సార్వత్రిక ఆందోళనల విషయాలపై ప్రపంచ బౌద్ధ ధర్మ నాయకత్వాన్ని, పండితులను నిమగ్నం చేయడానికి, వాటిని సమిష్టిగా పరిష్కరించడానికి విధాన సూచనలను తీసుకురావడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ప్రయత్నం చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement