Saturday, April 20, 2024

Breaking: మన న్యాయ వ్యవస్థ దేశానికే ఆదర్శం కావాలే.. న్యాయాధికారుల సదస్సులో సీఎం కేసీఆర్​

తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు శుక్రవారం హైదరాబాద్ ఫైనా న్సియల్ డిస్ట్రిక్ట్ లోని అన్వయ కన్వెన్షన్ లో ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కోర్టు భవనాల నిర్మాణం, కోర్టుల్లో సాంకేతిక తదితర మౌలిక వసతులను మెరుగు పరచడం, తగినంత న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించే చర్యలతో పాటు న్యాయ వ్యవస్థలో పని చేస్తున్న వారి సంక్షేమానికి తగు చర్యలు చేపట్టడం అనే అంశాలపై చర్చించనున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగులో ప్రసంగించారు.. ఆయన మాటల్లోనే..

‘‘గత ఎనిమివేళ్ళ క్రితం రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా పురోగమిస్తున్నది. మంచి ఉన్నతస్థాయి శిఖరాలను కూడా చేరుకుంటున్నది. నేను చాలా సంతోషంగా, సగర్వంగా మీ అందరి మధ్య ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఒక స్థాయి కలిగిన రాష్ట్రాలు అంటే గోవా, సిక్కిం లాంటి రాష్ట్రాలు పక్కనపెడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్–గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్లు వెలువరించిన లెక్కల ప్రకారం 2014-15లో రూ. 1.24 లక్షలున్న తెలంగాణ తలసరి ఆదాయం, రూ. 2.78 లక్షలకు చేరుకుంది.

పటిష్టమైనటువంటి పద్ధతులు ఫిస్కల్ ప్రుడెన్స్(ఆర్థిక జాగురూకత), హార్డ్ డిసిప్లేన్(కఠిన క్రమశిక్షణ) అమలు చేయడం ద్వారా ఈ పురోగతి సాధ్యమైంది. అలాగే విద్యుచ్ఛక్తి రంగంలో సాధించిన పురోగతితో అప్పట్లో ఉన్నటువంటి బాధలు ఇప్పుడు లేవు. వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సమాచార సాంకేతిక రంగాల్లో అద్భుతంగా మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఇంటిగ్రేటెడ్ అఫీషియల్ కాంప్లెక్స్ అని చెప్పి చాలా చక్కటి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లు కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం.  గతంలో ఉన్నటువంటి మన ముఖ్య న్యాయమూర్తులతో చాలా సందర్భాల్లో నేను చర్చిండం జరిగింది. తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ, న్యాయ పరిపాలనా విభాగం చాలా గొప్పగా ముందుకు పోవాలి.

ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయశాఖగా మనం పేరు గడించాలని నేను ప్రబలంగా ఆకాంక్షిస్తున్నాను. హైకోర్టు విడిపోయిన తర్వాత నేను పర్సనల్ గా కేంద్ర ప్రభుత్వానికి  లెటర్ రాయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రికి మా బెంచీల సంఖ్య పెంచండని కోరాం. కానీ అది పెండింగ్ లో ఉండింది.  మన తెలుగువారి ముద్దు బిడ్డ, భారత న్యాయ ఉన్నత శిఖరంగా పదవిని అధిరోహించిన తర్వాత వారికి హైదరాబాద్ పట్ల ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమానురాగాలతో వారు చొరవ తీసుకొని ప్రధానమంత్రితో, కేంద్రప్రభుత్వంతో మాట్లాడి మన హైకోర్టులో 24 నుండి 42కు మన బెంచీల సంఖ్యను పెంపొందింపచేశారు. రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, ప్రభుత్వం పక్షాన వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమ: సుమాంజలులు తెలియజేస్తా  ఉన్నాను.

- Advertisement -

న్యాయశాఖకు గతంలో 780 పై చిలుకు పోస్టులను మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్య హైకోర్టు కోసం బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి కరస్పాండింగ్ సిబ్బంది, స్టాఫ్ అందరు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ కోరారు. ఈ సందర్భంగా మరో 885 అదనపు పోస్టులు కూడా హైకోర్టుకు మంజూరు చేయడం జరిగింది. ఈ జీవో కూడా విడుదల చేసి చీఫ్ జస్టిస్ కు పంపించడం జరిగింది. హైకోర్టు తర్వాత ఉండేటువంటి జిల్లా కోర్టుల్లో పనిభారం బాగా ఉందని నాకు సమాచారం అందింది. తదనుగుణంగా జడ్జి పోస్టులను, మెజిస్ట్రేట్ పోస్టుల సంఖ్యను పెంచాలని నేను చీఫ్ జస్టిస్ ను కోరుతున్నాను.

జస్టిస్ నాగార్జున, హైకోర్టు చీఫ్ జస్టిస్ నేను కలిసినప్పుడు నాంపల్లి కోర్టు పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని న్యాయ వ్యవస్థ అవసరాలకు అప్పగించమని కోరడంతో ఆ మేరకు  ఆదేశాలివ్వడం జరిగింది.  కొత్తగా ఏర్పడిన 22 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రారంభించాలని చెప్పి నేను మన సీజేఐని కోరడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలివ్వడం జరిగింది.  డిస్ట్రిక్ట్ కోర్టుల నిర్మాణం కోసం స్థలాలు ఎంపిక చేసి పెట్టినట్టయితే, వాటన్నింటిని కూడ ప్రభుత్వం తక్షణం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేస్తుంది. అన్ని వసతులతో కూడిన భవనాల నిర్మాణం చేపడుదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.

కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లా కోర్టుల్లో కూడా సిబ్బంది కావాలని చెప్పడం జరిగింది. దాదాపుగా 1730 అదనపు పోస్టులు కావాలని చెప్పారు. వాటిని కూడా మంజూరు చేస్తామని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను.   హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టుల్లో తగిన సిబ్బందిని సమకూర్చుతాం.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన న్యాయపరిపాలన విభాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 4348. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన న్యాయపరిపాలనా విభాగం అద్భుతంగా ముందుకు పురోగమించడానికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి జస్టిస్ డిపార్ట్మెంట్ గా పేరు తెచ్చుకోవడానికి అన్ని వేళల్లో అవసరమైనటువంటి సహాయ, సహకారాలు అందించడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి సంసిద్ధంగా ఉందని నేను తెలియచేస్తున్నాను.

డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ కూడా చాలా వేగవంతంగా చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇది జరగలేదు. కొందరు పాక్షికంగా చేసి నిలిపివేశారు. 1 కోటి 52 లక్షల ఎకరాల భూముల రికార్డులు డిజిలైజ్ చేయడం జరిగింది. కోర్టుల పై ఉన్నటువంటి అపారమైన విశ్వాసంతో, నమ్మకంతో రెవెన్యూ కోర్టులను రద్దు చేసి, లిటిగేషన్లను తెలంగాణ జస్టిస్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయడం జరిగింది. మన రాష్ట్ర న్యాయమూర్తులు, వారి హోదాకు తగ్గట్టు హైదరాబాద్ రాష్ట్రంలో క్వార్ట్రర్స్ ఉండాల్సిన అవసరముంది. దానికి సంబంధించి సీజెఐ గారితో చర్చిండం జరిగింది. రాబోయే వారం రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మగారు, ఐకె రెడ్డిగారు, న్యాయమూర్తులందరూ పరిశీలన చేసి సరే అని చెప్తే 42 మంది జడ్జీలకు ఒకే చోట ఉండే విధంగా అద్భుతమైన క్వార్టర్స్ నిర్మించాలని అనుకున్నాం.  మన దుర్గం చెరువు ప్రాంతంలో  30 – 40 ఎకరాల స్థలంలో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో 42 మంది జడ్జిలకు ఒకే చోట క్వార్టర్స్ నిర్మించబోతున్నామని సంతోషంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారికి నేను తెలియజేస్తున్నాను.

ఇది ఫైనల్ అయిన వెంటనే, క్వార్టర్స్ శంఖుస్థాపన చేయడానికి రమణగారిని త్వరలో సాదరంగా ఆహ్వానిస్తాం.  జస్టిస్ రమణ గారి చొరవతో అల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను ప్రారంభించుకున్నాం.  కార్యకలాపాలు ప్రారంభమైనవి. వారి ఆశీస్సులతో దానికి బ్రహ్మాండంగా బిజినెస్ కూడా వస్తున్నది. అంతర్జాతీయ వర్తక, వ్యాపార, వాణిజ్య ‘డిస్పోజల్’ లో స్పీడు పెరిగినట్లయితే మనం ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో డైనమిక్, వైబ్రంట్  హైదరాబాద్ సిటీ మరింత డైనమిక్ గా, వైబ్రంట్ గా ఎదుగుతుంది. ఆ దిశగా మన న్యాయమూర్తులు ఈ విషయంలో కృషి చేయాలని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ ‘జ్యుడీషియల్ ఆఫీసర్స్ కన్వెన్షన్’ లో న్యాయవ్యవస్థకు సంబంధించిన 400 మంది అధికారులు కొలువుదీరిన  ఈ కార్యక్రమంలో ఫలవంతమైన చర్చలు జరగాలని నేను కోరుతున్నాను.ఈ సందర్భంగా తెలంగాణ న్యాయమూర్తుల సంఘం వెబ్ సైట్ ను సీఎం కేసీఆర్​ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement