Thursday, April 18, 2024

క్షమాపణ చెబితే ఆలోచిస్తాం: 12 మంది ఎంపీల సస్పెన్షన్ పై కేంద్రం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు 12 మంది విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేయడంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ను వెంటనే ఎత్తేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఆ ఎంపీలు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ ఎత్తేస్తామని, లేదంటే సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సభ గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు.

తాము చేసిన తప్పునకు చైర్మన్ ను ఆ 12 మంది ఎంపీలు క్షమాపణ కోరితే.. అప్పుడు వారి సస్పెన్షన్ను ఎత్తేసే విషయంపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న కేంద్ర మంత్రి.. ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతామని తెలిపారు. సభలో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉందని, కాబట్టి సభా సమావేశాలు ఫలప్రదంగా జరిగేందుకు ప్రతి పార్టీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement