Sunday, April 28, 2024

హరేన్​పాండ్యా మాదిరిగా తనను ట్రీట్​ చేయరనే అనుకుంటున్నా.. మోదీ, షాలపై స్వామీ కామెంట్స్​!

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తనకు కూడా హరేన్‌ పాండ్యాకు ఇచ్చిన ట్రీట్‌మెంటే ఇవ్వరని అశిస్తున్నా అంటూ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేశారు బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి. ఆ బీజేపీ అగ్ర నాయకులిద్దరూ తనకు ఎంతిస్తే.. తాను కూడా అంతకు తగ్గకుండా తిరిగిస్తానని హెచ్చరించారు. ‘‘మోదీ, షా నా మీద కూడా హరేన్‌ పాండ్యా మీద ప్లాన్ చేసినట్టు చేయరనుకుంటున్నా. ఒకవేళ అదే చేస్తారనుకుంటే నేను నా మిత్రులను అప్రమత్తం చేయాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, వాళ్ల నుంచి నేను ఏది పొందినా నేను అంతకు తగ్గకుండా తిరిగి ఇచ్చేస్తా’’ అని ఇవ్వాల తన ట్విట్టర్‌ అకౌంట్లో పోస్ట్‌ పెట్టారు.

మోదీ, అమిత్‌ షా ఇద్దరూ పార్టీలోని సీనియర్‌ నాయకులకు తగిన మర్యాద ఇవ్వడం లేదని స్వామి ఆరోపించారు. ఆరెస్సెస్‌లోని అగ్ర నాయకులను కూడా ఆ ఇద్దరు అమర్యాదగా చూస్తున్నారని మండిపడ్డారు. హరేన్‌ పాండ్యా 2003లో అహ్మదాబాద్‌లో హత్యకు గురయ్యారని, అప్పుడు ఆయన గుజరాత్‌ మాజీ హోంమంత్రి అని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. గోద్రా అల్లర్ల తర్వాత ప్రభుత్వం అనుసరించిన తీరుపై పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయనను పార్టీ నుంచి తొలగించారని, తర్వాత హత్యకు గురయ్యాడని తెలిపారు.

అయితే.. తాను హరేన్‌ పాండ్యా హత్య గురించి మాట్లాడటం లేదని, ఆయనను పార్టీ నుంచి పక్కనపెట్టిన విషయం గురించి మాట్లాడుతున్నానని స్వామి క్లారిటీ ఇచ్చారు. కాగా, జడ్‌ కేటగిరీ ప్రొటెక్టీ అయిన సుబ్రమణ్యస్వామి వ్యక్తిగత నివాసం దగ్గర భద్రత సమస్య పరిస్కారంపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇవ్వాల ఉదయం కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దాంతో స్వామి నివాసం వద్ద భద్రతను పునఃసమీక్షిస్తామని కేంద్రం తెలిపింది. సుబ్రమణ్యస్వామి తనకు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీచేసి వ్యక్తిగత ఇంట్లోకి మారాడు. ఆపై సెక్యూరిటీ విషయమై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement