Wednesday, May 1, 2024

రాహుల్‌ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్న నేప‌థ్యంలో ఆయ‌న‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్‌ కానీ, ఆయ‌న‌ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు, హక్కులను ప్రస్తావించారో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని కవిత ప్రశ్నించారు. దేశంలో ఒకే వరి కొనుగోలు విధానంపై త‌మ‌ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదాతో పాటు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారని ఆమె నిలదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కవిత అడిగారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై మీ పార్టీ నేతలను అడగాలని, అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో అడిగి తెలుసుకోవాలని రాహూల్‌ గాంధీకి సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement