Wednesday, May 1, 2024

కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు.. రేవంత్ పై హరీష్ సంచలన వ్యాఖ్య

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని మరోసారి తెలంగాణ ప్రజలు రానివ్వరని అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణకు వస్తున్నారని ఆరోపించారు. తనవారిని కాంగ్రెస్‌లోకి పంపి అధికారంలోకి రావాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారని హరీష్‌రావు తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే.. ఆంధ్రాబాబు అని ప్రజలు వెళ్లగొట్టారని తెలిపారు.

టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నవ్యక్తి కాదా ? అని ప్రశ్నించారు. చంద్రబాబే మళ్లీ కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి వస్తున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయని పని టీఆర్ఎస్ చేసిందని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలోనూ తాము రైతుల‌ నుంచి ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మొత్తం ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: పూటకో హామీ..గంటకో అబద్ధం.. కేసీఆర్ పై బండి నిప్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement