Tuesday, April 30, 2024

‘మన ఊరు మన బడి’ కార్యక్రమం.. మంత్రి కేటీఆర్ పిలుపుకు దాతల స్పందన

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేయనున్న ఏడు వేల కోట్ల రూపాయలకుపైగా నిధులకు తోడుగా సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ముందుకు రావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చల్మెడ లక్ష్మి నర్సింహరావు ఈరోజు ఒక స్కూల్ భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావుని హైదరాబాదులో కలిసిన ఆయన, సిరిసిల్ల జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు హామీ ఇచ్చారు.

తన తండ్రి మాజీ మంత్రి చల్మెడ ఆనంద్ రావు సొంత గ్రామమైన సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మలకపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, తన తండ్రి కోరిక మేరకు అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. సుమారు కోటిన్నర రూపాయలతో స్కూలు భవన నిర్మాణాన్ని కార్పొరేట్ పాఠశాల స్థాయిలో చేపట్టనున్నట్లు తెలిపిన ఆయన.. ఇందుకు సంబంధించిన బిల్డింగ్ ప్లాన్ లను, ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కి అందించారు. ఈ భవన నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేస్తానని లక్ష్మినర్సింహ రావు ఈ సందర్భంగా కెటిఆర్కి హామీ ఇచ్చారు.

ఒక ఉదాత్తమైన ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో  భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చిన లక్ష్మి నర్సింహ రావుని మంత్రి కేటీఆర్ అభినందించారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను ఇందుకు ఎంచుకోవడం పట్ల లక్ష్మి నర్సింహరావు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement