Tuesday, April 23, 2024

బాంబే గోల్డ్ ఎగ్జిబిష‌న్ లో.. ప్ర‌ధాని మోడీ గోల్డ్ ప్ర‌తిమ‌

గుజ‌రాత్ సూర‌త్ కి చెందిన న‌గ‌ల వ్యాపారి ప్ర‌ధాని మోడీ ప్ర‌తిమ‌ని రూపొందించాడు. 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ ప్రతిమ బరువు 156 గ్రాములు. దీనిని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌ లో పెట్టారు. ప్రధాని మోడీ బంగారు విగ్రహంపై 156 గ్రాములు అని రాసి ఉంది. ఇలా రాసి ఉండటం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 సీట్లు గెలుచుకుంది. దీనికి గుర్తుగా 156 గ్రాముల బంగారంతో ఈ విగ్రహాన్ని రూపొందిచారట. తక్కువ బంగారంతో అందమైన విగ్రహాన్ని తయారు చేయడం నిజంగా కళాత్మకత అనే చెప్పాలి. ఈ విగ్రహాన్ని తయారు చేసింది రాధికా చైన్స్ జ్యూవెల్లరీ యజమాని బసంత్ బోహ్రా. ఆయన గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నగల వ్యాపారి. ఈ విగ్రహం 4.5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 156 గ్రాముల బరువు ఉంది.

బంగారు-వెండి ఆభరణాల తయారీ కంపెనీ రాధికా చైన్స్ యజమాని బసంత్ బోహ్రా మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 183 సీట్లకు 156 సీట్లు గెలుచుకుంది. అందుకు గుర్తుగా ప్రధానమంత్రి బంగారు విగ్రహాన్ని 156 గ్రాములతో రూపొందించినట్టు తెలిపారు. ఈ విగ్రహం తయారీకి రూ.10.5 లక్షలు ఖర్చు చేసినట్లు బోహ్రా తెలిపారు.బసంత్ బోహ్రా స్వస్థలం రాజస్థాన్. తాను మోడీ అభిమాని అని, ఆయనకు ఏదైనా అంకితమివ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. బసంత్ బోహ్రా ఒక వార్తా వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. తన ఫ్యాక్టరీలో ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు 20 మంది కళాకారులకు మూడు నెలల పాటు శ్రమించారని తెలిపారు. దీని తుది ఆకృతితో తాను సంతృప్తి చెందాననీ, ఇప్పటికైతే ఇది అమ్మాలని అనుకోలేదనీ, అందుకే దీనిపై ప్రైజ్ ట్యాగ్ లేదని అన్నారు. డిసెంబరు నాటికి విగ్రహం పూర్తయిందనీ, అయితే 156 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది, అయితే, గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత, కళాకారులు బరువు తగ్గించడానికి కొన్ని మార్పులు చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement