Sunday, April 28, 2024

సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ లా ఫీల‌య్యా: బ్రిటన్ ప్రధాని బోరిస్

భారత పర్యటనపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల భార‌త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న రెండో రోజు ఢిల్లీలో ప్ర‌ధాని మోదీతో భేటీ అయ్యారు. ప‌లు కీల‌క అంశాల‌పై ఇరువురూ చ‌ర్చించారు. మొద‌టి రోజు గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో త‌న‌కు ల‌భించిన స్వాగ‌తానికి బోరిస్ జాన్స‌న్ ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇంత ఘ‌నంగా తనకు స్వాగ‌తం ప‌లికినందుకు ప్ర‌ధాని మోదీకి, భార‌త ప్ర‌జ‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు చెప్పారు. తన స్వాగ‌త హోర్డింగులు చూసి.. ఓ స‌చిన్ టెండూల్క‌ర్‌లా, అమితాబ్‌లా ఫీల‌య్యాను అని బోరిస్ జాన్స‌న్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ నిఖార్సైన స్నేహితుడని చెప్పారు. భారత్ తో బంధాన్ని మరింత దృఢం చేసుకునే అనేక అంశాలపై తాము చర్చించామని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. పలు వస్తువులు, సామగ్రిపై భారత్ టారిఫ్ లను తగ్గించడం అభినందనీయమని, అందుకు బదులుగా తాము కూడా కొన్ని టారిఫ్ లను తగ్గిస్తున్నామని ప్రకటించారు. రక్షణ పరికరాలు, ఉత్పత్తులకు సంబంధించి డెలివరీ టైమ్ ను తగ్గిస్తున్నామని, భారత్ కు ప్రత్యేకంగా జనరల్ ఎక్స్ పోర్ట్ లైసెన్స్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. రక్షణ రంగంలో సరికొత్త విస్తృత భాగస్వామ్యానికి నాంది పడిందన్నారు. ఇండో పసిఫిక్–రీజియన్ లో భద్రతను పెంపొందించేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement