Thursday, April 25, 2024

ఈ కరోనా వేరియంట్ చాలా ప్రమాదకరం.. వ్యాక్సిన్‌లనూ బోల్తా కొట్టిస్తోంది: WHO

క‌రోనాకు చెందిన‌ B.1.617 వేరియంట్ వల్ల భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్‌ తెలిపారు. దాని వల్లే ఇండియాలో ఇంతటి విలయం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వ్యాప్తిని పెంచిన వేరియంట్లు ఎన్నో ఉన్నాయ‌ని, అందులో ఇదీ ఒక‌ట‌ని సౌమ్య చెప్పారు. కాగా ఈ వేరియంట్‌ను తొలిసారి ఇండియాలోనే గ‌తేడాది అక్టోబ‌ర్‌లో గుర్తించారు. దీనిని ఒక ప్ర‌త్యేక‌మైన వేరియంట్‌గా డ‌బ్ల్యూహెచ్‌వో కూడా ఈ మ‌ధ్య లిస్ట్ చేసింది.

అయితే B.1.617ను ఇప్ప‌టి వ‌ర‌కు ఆందోళ‌న క‌లిగించే వేరియంట్‌గా మాత్రం డ‌బ్ల్యూహెచ్‌వో గుర్తించ‌లేదు. ఈ ముద్ర ప‌డిందంటే ఇది ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తుంద‌ని, చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, వ్యాక్సిన్ల‌నూ బోల్తా క‌ట్టిస్తుంద‌ని అర్థం. ఇప్ప‌టికే అమెరికా, బ్రిట‌న్‌లాంటి దేశాలు దీనిని ఆందోళ‌న క‌లిగించే వేరియంట్‌గా గుర్తించ‌గా.. త్వ‌ర‌లోనే డబ్ల్యూహెచ్‌వో కూడా గుర్తిస్తుంద‌ని సౌమ్య స్వామినాథ‌న్ వెల్ల‌డించారు. వ్యాక్సిన్ల ద్వారా వ‌చ్చిన‌ యాంటీబాడీల‌ను కూడా బోల్తా కొట్టించే కొన్ని మ్యుటేష‌న్లు ఈ B 1.617 వేరియంట్‌లో ఉన్నాయ‌ని సౌమ్య స్వామినాథ‌న్ చెప్పారు. అందుకే దీనిని ఆందోళ‌న క‌లిగించే వేరియంట్‌గా గుర్తించ‌వ‌చ్చ‌న్నారు. అయితే ఈ వేరియంట్‌దే మొత్తం బాధ్య‌త అని చెప్ప‌లేమ‌ని, క‌రోనా వెళ్లిపోయింద‌ని బాధ్య‌ర‌హితంగా తిరిగార‌ని, అందువ‌ల్లే ఈ విప‌త్తు సంభవించిందని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement