Friday, May 3, 2024

2 డీజీ డ్రగ్ ఒక్కో సాచెట్ ధర రూ.990

కరోనా బాధితుల చికిత్స కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్కో సాచెట్‌ ధర రూ. 990గా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఆ డిస్కౌంట్‌ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది. ఈ నెల 17న తొలి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది.

కరోనా కట్టడి కోసం డీఆర్‌డీవో ఏడాది పాటు శ్రమించి ఈ ఔషధాన్ని తీసుకొచ్చింది. గతంలో దీన్ని క్యాన్సర్‌ కోసం తయారుచేశారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కరోనాకు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌ వైరస్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదని, ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. కాగా.. ఈ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దీని తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement