Saturday, May 11, 2024

బీజేపీలో ముసలం.. అసమ్మతి నేతలను సస్పెండ్​ చేయాలని తీర్మానాలు

ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్:  బీజేపీ అసమ్మతి నేతలపై చర్యకు అధిష్టానం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. నేడో రేపో వారికి షోకాజు నోటీసులు జారీ కానున్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితమే పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లా నేతలు వీరిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్టు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.. కాగా, వారికి ముందుగా నోటీసుల జారి చేసి, అనంతరం చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఆయా నేతలిచ్చే వివరణ సంత్రుప్తిగా లేకపోతే వేటు ఖాయమంటున్నారు కొంతమంది బీజేపీ లీడర్లు..

మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొందరు బీజేపీ నేతలు పదేపదే పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా అసమ్మతి సమావేశాలు నిర్వహించడాన్ని పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా పరిగణించింది. వీరిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు సూచించినట్టు  తెలసింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ వారిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అసమ్మతి నేతలకు నోటీసులు సిద్ధం చేశారు. ఒకటి, రెండ్రోజుల్లో నోటీసులకు ఆయా నేతలకు చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్న తరుణంలో గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, సుగుణాకర్ రావు అసమ్మతి పేరిట పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరించడాన్ని  బండి సంజయ్ తప్పుపడుతున్నారు. ఆయా నేతలను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన కోర్ కమిటీలు తీర్మానం చేసి కొద్దిరోజుల క్రితం జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు పంపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement