Sunday, April 28, 2024

Ram Setu | రాజ్యసభలో రామసేత రచ్చ.. అవునో, కాదో చెప్పలేమంటూ కేంద్రం దాటవేతధోరణి!

రామసేతు అంశం ఇవ్వాల రాజ్యసభలో వేడిపుట్టించింది. శుక్రవారం ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలిచే రామసేతుపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి హర్యానాకు చెందిన స్వతంత్ర ఎంపీ కార్తికేయ శర్మ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన కోసం ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిలో సమాధానం చెప్పింది. “సాధారణంగా చెప్పుకున్నట్టయితే రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం. అయితే.. నిర్మాణానికి సంబంధించిన కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ నిర్మాణం అక్కడ ఉండి ఉండవచ్చు” అని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్​ సమాధానమిచ్చారు. ఇంకా.. ఈ విషయాన్ని గత ప్రభుత్వాలపై తోసివేస్తూ మాట్లాడారు.

దీంతో భారతదేశానికి చెందిన అద్భుతమైన చరిత్రపై ప్రభుత్వం ఏదైనా శాస్త్రీయ పరిశోధన చేస్తుందా” అని కార్తికేయ శర్మ ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బదులిస్తూ.. ‘రామసేతుకు సంబంధించి ప్రశ్న లేవనెత్తినందుకు సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి మాకు కొన్ని పరిమితులున్నాయి. ఎందుకంటే ఇది దాదాపు 18 వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర. మనం మాట్లాడుకుంటున్న వంతెన దాదాపు 56 కి.మీ పొడవు ఉంటుంది. స్పేస్ టెక్నాలజీ ద్వారా సముద్రంలో కొన్ని రాళ్ల ముక్కలు ఉన్నట్టు కనుగొన్నాము. రామసేతు ఉన్నట్టు చూపించే కొన్ని ఆకారాలున్నాయి. సముద్రంలో కొన్ని ద్వీపాలు, సున్నపురాయి వంటివి కనిపించాయి. సింపుల్ గా చెప్పాలంటే రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం. అయితే.. అక్కడ నిర్మాణం ఉండవచ్చని సూచించే కొన్ని సూచనలు కూడా ఉన్నాయి.” అన్నారు. అంతేకాకుండా పురాతన నగరం ద్వారక, అటువంటి కేసులను పరిశోధించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

దీనిపై కాంగ్రెస్‌ అధినేత పవన్‌ ఖేరా బీజేపీపై విమర్శలు గుప్పించారు.. ‘‘భక్తులందరూ చెవులు విప్పి వినండి, కళ్లు తెరిచి చూడండి.. రామసేతు ఉందనడానికి ఎలాంటి రుజువు లేదని పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం చెబుతోంది. ప్రాచీన భారతీయ సంస్కృత ఇతిహాసం రామాయణంలో, రామసేతును రాముడు, అతని సైన్యం నిర్మించినట్లు ప్రస్తావన ఉంది. అందువల్ల, ఇది గొప్ప చారిత్రక.. సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది”అని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement