సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ అయ్యారు. సజ్జనార్ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ కొత్త కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర నియామించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ తన పదవీ కాలంలో ఆయన సమర్థవంతమైన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సజ్జనార్ పని చేశారు. 1996 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్.. కీలకమైన కేసులను పరిష్కరించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎకౌంటర్ తర్వాత సీపీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
కొవిడ్ సమయంలో వలస కూలీలను ఆదుకోవడం, సొంత ప్రాంతాలకు తరలించడం కోసం చొరవ తీసుకున్నారు. కొవిడ్ రోగులకు తగిన వైద్యసాయం అందించేందుకు ఉచిత ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందించడం, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కరోనా వేళ రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో సజ్జనార్ ఏడాది వ్యవధిలో 3సార్లు రక్తదానం చేసి.. కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 5వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు అందించారు. కాగా, 1999 బ్యాచ్కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ఇక సైబరాబాద్కు కొత్త సీపీగా సేవలు అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.