Friday, April 26, 2024

అవనిగడ్డలో కోవిడ్ రోగుల దారుణ దృశ్యాలు

కృష్ణా జిల్లా అవనిగడ్డలో అధికారుల నిర్లక్ష్యం కోవిడ్ రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవనిగడ్డలో 50 బెడ్ల సామర్థ్యంతో కోవిడ్ సెంటర్‌ను మూడు రోజుల క్రితం కలెక్టర్ ప్రారంభించారు. కానీ 12 బెడ్లకు మాత్రమే రోగులను తీసుకున్నారు. మిగతా 38 బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. కానీ పాజిటివ్ ఉన్న రోగుల ఆక్సిజన్ లెవల్స్ 70 శాతానికి పడిపోయినా కోవిడ్ కేర్ సెంటర్‌లోని బెడ్లను రోగులకు ఇవ్వడం లేదు. దీంతో కోవిడ్ రోగులు టెంపోలో పరదాలు కట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. రహదారులపై పడిగాపులు కాస్తున్న రోగులను పోలీసులు తరిమికొడుతున్నారు.

మరోవైపు అవనిగడ్డ కోవిడ్ సెంటర్ కు మూడు రోజుల క్రితం 50 ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగాప్రముఖ క్యాన్సర్ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్ విరాళంగా ఇచ్చారు. కానీ అత్యవసర సమయంలోనూ వాటిని అధికారులు ఉపయోగించడంలేదు. దీంతో దాత ఆశయం నెరవేరడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులు చచ్చిపోతున్నా అధికారులు పట్టించుకోరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి 50 బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement