Monday, April 29, 2024

కొవాగ్జిన్ ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయం: భారత్ బయోటెక్

కొవాగ్జిన్ వ్యాక్సిన్ ప‌రిజ్ఞానం మొత్తం భారత్‌ బయోటెక్‌దేన‌ని ఆ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా చెప్పారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌డానికి తాము భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నుంచి ప‌రిజ్ఞానాన్ని ఏమీ తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిజ్ఞానాన్ని మరిన్ని ఔషధ కంపెనీలకూ బదిలీ చేయాలని ఇటీవ‌ల కొంద‌రు వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. కరోనా స్ట్రెయిన్‌ను సేకరించి వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల‌కు అందించడం, అలాగే కోతులు, ఎలుకలపై ప్రయోగ పరీక్షల్లో మాత్రమే ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ స‌హ‌క‌రిస్తాయ‌న్నారు.

పెద్ద జంతువులపై నేరుగా ప్రయోగ పరీక్షలు జరిపేందుకు ప్రైవేటు ఔషధ సంస్థలకు అనుమతులు లేనందు వల్లే కేవ‌లం ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్‌, ఎన్‌ఐవీ సహకారాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ రెండు సంస్థ‌ల నుంచి కరోనా స్ట్రెయిన్ అందిన అనంతరం వ్యాక్సిన్ త‌యారీలో మొత్తం పనిని తామే చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీకి పూర్తిస్థాయిలో త‌మ సంస్థ‌ నిధుల‌నే వాడామ‌ని తెలిపారు. సొంత ల్యాబ్‌లలో స్ట్రెయిన్‌ను పరీక్షించామ‌ని, అలాగే, వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించే వ‌ర‌కు త‌మ సంస్థే సొంతంగా ప‌నులు చేసుకుంద‌ని చెప్పారు. ఇత‌ర‌ ఫార్మా సంస్థ‌ల‌కు కొవాగ్జిన్‌ పేటెంట్లతో పాటు తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసే ప్రసక్తి లేదని ఆమె స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియ చాలా క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌క్రియ అని చెప్పారు. కాగా చిన్నారుల‌పై కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు వ‌చ్చేనెల‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంద‌ని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement