Thursday, April 25, 2024

ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్… బీజేపీలోకి రాహుల్ సన్నిహితుడు

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజల కోసం పని చేయలేకపోతున్నానని తెలిపారు. అలాంటప్పుడు పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిజమైన రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ ఒక్కటేనని తాను భావిస్తున్నానన్నారు. దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రధాని మోడీ మాత్రమే ఎదుర్కోగలదని చెప్పారు.  

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితంగా జితిన్‌ ప్రసాద మెలిగారు. రాహుల్‌ గాంధీ సన్నిహితుల్లో కాంగ్రెస్‌ను వీడిన రెండో వ్యక్తి జితిన్ ప్రసాద కావడం గమనార్హం. గతంలో జ్యోతిరాధిత్య సింధియా సైతం బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేవ్ కు 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో జితిన్‌ ప్రసాద పార్టీ వీడడం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ. ప్రసాద్ గత రెండు లోక్ సభ ఎన్నికల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. మెలిగిన జితిన్‌ 2019లోనే పార్టీని వీడుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనకు నచ్చజెప్పినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. అయితే, పార్టీ పనితీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆయన ఎట్టకేలకు కాంగ్రెస్‌ను వీడారు. జితిన్ ప్రసాద వైదొలిగినందుకు విచారకరం అని, ఆయన పార్టీలో ముఖ్యమైన పదవులను నిర్వహించారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియ శ్రీనేట్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement