మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఈ రోజు ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొని..అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం మెస్సర్స్ సెంచరీప్లై పరిశ్రమకు శంకుస్థాపనలో పాల్గొంటారు. సీకే దిన్నె మండలం కొప్పర్తి గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చి ప్రారంభిస్తారు. వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్క్లేవ్ వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్హౌస్లో రాత్రి బస చేస్తారు.
ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం(డిసెంబర్ 24) ఉదయం 9.05 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్లో ఆదిత్య బిర్లా యూనిట్కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖిలో సీఎం జగన్ పాల్గొంటారు. మార్కెట్ యార్డుకు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాణితోపు సమీపంలో ఆక్వాహబ్ ప్రారంభోత్సవం చేస్తారు. సాయంత్రం 5.05 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్హౌస్లో రాత్రి బస చేస్తారు.
మరోవైపు మూడో రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 25న పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో ఏర్పాటుచేసిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం కడప పర్యటన ముగించుకుని తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital