Sunday, May 19, 2024

కాలినడకన కలియతిరుగుతూ.. యాదాద్రిలో నిర్మాణ ఏర్పాట్లు చూసిన కేసీఆర్​..

యదాద్రి, ప్రభన్యూస్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం 17వ సారి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. మార్చి నెల 28న యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో పునః నిర్మాణ పనుల పరిశీలనకు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో గీతా రెడ్డి స్వామి వారి ప్రసాదంను సీఎంకు అందజేశారు. అనంతరం బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీఎం కెసీఆర్ కు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ పునః నిర్మాణ పనులు పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పనులను పరిశీలించారు.

ప్రధానాలయం, గర్భగుడిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పనులను పరిశీలించారు. కళ్యాణ కట్ట , పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణీలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన అనంతరం స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలనూ సీఎం పరిశీలించారు. అలయ నిర్మాణం తుది దశ పనులు, సుదర్శన యాగం నిర్వహణ కోసం ఏర్పాట్లపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీఎం కేసీఆర్ వెంట మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామ కృష్ణారావు, ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement