Wednesday, May 15, 2024

యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్!

కరోనా బారిన పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. సాధారణ హెల్త్ చెకప్‌ తో పాటు, కేసీఆర్‌ కు సిటీ స్కాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌‌ కు వెళ్లనున్నారు. 

కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా ఫామ్‌ హౌస్‌ ‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని యశోదా ఆస్పత్రి వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఫామ్ హౌస్‌ లో కేసీఆర్  విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

కాగా, సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితమే నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియా ఎన్నికల సభలో పాల్గొన్నారు. నోముల భగత్‌ కు కూడా కరోనా సోకింది. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement