Friday, April 26, 2024

మ‌ళ్లీ బండికే ప‌గ్గాలు?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌నే మరో మారు కొనసాగించాలని ఆ పార్టీ అధిష్టా నం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ పదవీ కాలం ముగు స్తోంది. ఇదే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లి సాధారణ ఎన్నికలుండడంతో పార్టీ అధ్య క్షుడిని మార్చడం సానుకూల పరిణామం కాదని బీజేపీ అధిష్టానంగా బలంగా విశ్వసిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పలు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే అధిష్టానం కొనసాగించింది. నడ్డాకు మరోమారు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలోనూ అసెంబ్లిd ఎన్నికలు ఉండడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్చకపో వచ్చని పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 24న మహబూబ్‌నగర్‌లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నాటికి బండి సంజయ్‌ పదవీ కాలం పొడిగింపుపై అధిష్టానం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు.

అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, సీనియర్‌ నేత డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆశిస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు అధిష్టానం వద్ద తమకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని విజ్ఞప్తులు చేసినట్లు తెలి సింది. అయితే పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం ఈటల రాజేందర్‌ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే చేరికలు ముఖ్యమైన అంశం కావడంతో ఆ బాధ్యతలకే ఈటలను పరిమితం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉండడంతో ఆమెను అదే పదవిలో కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీ అధిష్టానం మాత్రం ఎన్నికలు సమీపించిన తరుణంలో బండి సంజయ్‌ను మార్చకూడదన్న అభిప్రాయంతో ఉందని నేతలు చెబుతున్నారు.
గడిచిన 2020 ఏడాదిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం
ఫిబ్రవరిలో ఆయన పదవీ కాలం ముగుస్తోంది.
అయితే రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో బండి సంజయ్‌ కీలక పాత్ర పోషించారు. వరుసగా మూడు విడతలుగా ప్రజా సంగ్రామయాత్ర నిర్వహించి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. బండిసంజయ్‌ సారథ్యంలోనే దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడంతోపాటు జీహెచ్‌ ఎంసీ ఎన్నికల్లోనూ 44 కార్పోరేటర్‌ సీట్లను బీజేపీ గెలుచు కుంది. ఓ దశలో అధికార బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో ప్రత్యా మ్నాయం బీజేపీ అన్న స్థితికి పార్టీని తేవడంలో బండి సంజ య్‌ పాత్ర కీలకం. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి సమర్థ వంతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ విమర్శలను గట్టిగా తిప్పి కొట్టడంలోనూ బండి సఫలీకృతమయ్యారు. తెలంగాణలో ప్రధాని మోడీతోపాటు అమిత్‌ షా సభలను విజయవంతం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. పలు మార్లు సభా వేదికలపైనే బండి సంజయ్‌ నాయకత్వాన్ని ప్రధాని మోడీతోపాటు అమిత్‌ షా, జేపీ నడ్డా కొనియాడారు. రాష్ట్ర అసెంబ్లిd, పార్లమెంట్‌ ఎన్నికల సమీపించిన ఈ తరుణంలో మరో రెండేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించొద్దన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement