Thursday, May 16, 2024

రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ

అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ అందించింది. ఈ మేరకు సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ప్రపంచంలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి రైతులు, రైతు కూలీలు చాలా ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరుగుతోందన్నారు. వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం ప్రకటించారు.

లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది.  రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. తొలుత ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే, ఈ క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్‌ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement