Tuesday, May 7, 2024

రేపే అమిత్ షా రాక – తెలంగాణ‌లో పొలిటిక‌ల్ కాక‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పార్లమెంటరీ ప్రవాస్‌ యోజనలో భాగంగా ఈ నెల 23న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ను పెంచబోతోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా చేవెళ్ల బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌, అధికార బీఆర్‌ఎస్‌ నుంచి కీలక నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధులు కూడా ఈ లిస్టులో ఉన్నారన్న ప్రచారం జరుగుతుండడంతో అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

చేవెళ్ల పర్యటన షెడ్యూల్‌లో అమిత్‌ షా తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సమయాన్ని కూడా కేటాయించారు. నోవాటెల్‌ హోటల్‌లో తెలంగాణ కోర్‌ కమిటీ సమావేశంలో అమిత్‌ షా పాల్గొననున్నారు. బూత్‌ కమిటీ ఏర్పాటు, బూత్‌ సశక్తీకరణ్‌ కార్య క్రమంలో వెనకబడిన నియోజక వర్గాలు, పార్టీలో లోపించిన కో-ఆర్డినేషన్‌, ఇటీవల ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు, ఆతర్వాత ఎంపీ అర్వింద్‌, బండి మధ్య విభేదాలు, తదితర అంశాలు
కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ నేతలు చెబుతున్నారు.

అమిత్‌ షా షెడ్యూల్‌ ఇదే…
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 23వ తేదీ పర్యటన ఖరారైంది. అమిత్‌ షా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. 3.50 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం 4గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంతో సమావేశమవుతారు. ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న సందర్భంగా నటీనటులను సత్కరించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు చేవెళ్ల సభకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్‌ షా చేవెళ్ల బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రి 7.45 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లి బయల్దేరి వెళతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement