Thursday, May 16, 2024

ALERT: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ఈ నెల 6 నుంచి పరీక్షలు షురూ

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 6 నుంచి 23 వరకు జరుగనున్న ఈ పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు, ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. గాలి, వెలుతురు ఉన్న గదులలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

పరీక్ష కేంద్రంలో విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశావర్కర్స్, ఏఎన్‌ఎం అందుబాటులో ఉంచనున్నారు. డీహైడ్రేషన్ నుంచి రక్షించేందుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచతున్నారు. పరీక్ష కేంద్రంలోని గదికి 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయిస్తున్నారు. విద్యార్థులు పరీక్షే కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా సెంటర్ లొకేషన్ గుర్తింపు ప్రక్రియకు వెసులుబాటు కల్పించారు. రెండు, మూడు రోజుల్లో మొబైల్ యాప్ వివరాలను బోర్డు అధికారులు ప్రకటించనున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేందుకు ప్రత్యేకంగా ఆర్‌టిసి బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలంటే భయాందోళనలకు గురయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement