Monday, April 29, 2024

Exclusive | షిండేకు మూడింది.. అనర్హత వేటుపై స్పీకర్​ నోటీసులు!

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. శివసేనలో తిరుగుబాటుకు కారణమై, ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్​నాథ్​ షిండేకు క్లిష్ట పరిస్థితులు ఎదురుకాబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ఏకనాథ్ షిండేతో సహా శివసేన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని నిర్ణయించాలని మే 11న సుప్రీంకోర్టు స్పీకర్‌ను కోరింది. ఈ క్రమంలో స్పీకర్​ రాహుల్​ నార్వేకర్​ షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్​ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అనర్హత వేటు వేయకుండా ఉండాలంటే తగిన ఆధారాలు చూపాలని వారం రోజుల గడువు ఇచ్చారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇవ్వాల (శనివారం) నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు ప్రతిస్పందించడానికి ఏడు రోజుల గడువు ఇచ్చారు. అనర్హతపై చర్య తీసుకోకుండా ఉండటానికి అవసరమైన అన్ని ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి శివసేన రాజ్యాంగం కాపీ తనకు అందిందని నార్వేకర్ చెప్పడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కోర్టు విచారణ త్వరలో జరగనుంది. ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేలను స్పీకర్ పిలిచి ఆధారాలతో సహా తమ అభిప్రాయాలను కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరంగా.. గత ఏడాది శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గం టిక్కెట్‌పై అంధేరి (తూర్పు) ఉప ఎన్నికలో గెలిచిన అతని కుమారుడు ఆదిత్య, రుతుజా లట్కేలకు మాత్రం ఎట్లాంటి నోటీసు అందలేదు. ఇక.. ఏకనాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరించేలా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేనకు చెందిన ఎమ్మెల్యే సునీల్ ప్రభు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏకనాథ్ షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని నిర్ణయించాలని మే 11న సుప్రీంకోర్టు స్పీకర్‌ను కోరింది. గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే, మరో 15 మంది ఇతర ఎమ్మెల్యేలు అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటుకు చేశారు. దీని ఫలితంగా మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం కూలిపోయింది. తదనంతరం షిండే, తిరుగుబాటు శాసనసభ్యులు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో చేతులు కలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement