Tuesday, April 30, 2024

Story | పల్లెలకు పాకిన ఐపీఎల్​​ బెట్టింగ్..​ జిల్లాల్లోనూ జోరుగా దందా!

దేశంలో జెంటిల్‌మెన్‌ గేమ్‌ మొదలైంది. మార్చి 31న ప్రారంభమైన క్రికెట్‌ వేడుక మే 28తో ముగియనుంది. ఎక్కడ చూసినా నలుగురు కలిస్తే అదే చర్చా. ఈ మాయలో పడికొందరు డబ్బులు కూడ బెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే, అదే మాయలో పడి మరికొందరు సర్వం కోల్పోతున్నారు. ఒకప్పుడు సంపన్నులకు, పట్టణాలకే పరిమితమైన క్రికెట్‌ బెట్టింగ్‌లు ఇప్పుడు అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఆన్‌లైన్‌ వేధికగా మారుమూల పల్లెలను కూడా పట్టిపీడిస్తున్నాయి. ఈ మాయలో పడి బానిసలైన యువత, ప్రజలు క్రికెట్‌ పై ఉన్న మోజుతో బెట్టింగ్‌లు పెట్టి అప్పుల పాలై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు ఈ బెట్టింగ్​ మాఫియా కోల్‌బెల్ట్‌ ప్రాంతంతో పాటు మిగతా మండలాలకూ పాకింది.

‌– ప్రభన్యూస్‌ ప్రతినిధి, భూపాలపల్లి

జయశంకర్‌ భూపాలపల్లిలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వేదికగా ఈ మాయలో పడి యువత ఉన్నది కాస్తా ఊడగొట్టుకుంటున్నారు. ఒందరు మాత్రం పోయిన చోట వెతుక్కోవాలని అప్పులు చేసి మరి బెట్టింగ్‌లు పెడుతూ మరింత అప్పుల ఊభిలో కూరుకుపోతున్నారు. గత ఐపిఎల్‌ సీజన్‌లలో ఎన్నో కుటుంబాలు ఈ సరదాకు బలయ్యాయి. ఇప్పటికే భూపాలపల్లి సింగరేణి కోల్‌బెల్ట్‌ ప్రాంతంతో పాటు గణపురం, కాటారం, మహాదేవపూర్‌, మొగుళ్ళపల్లి , చిట్యాల, టేకుమట్ల, తదితర జిల్లాలోని సుమారు అన్ని ప్రాంతాల్లో ఈ బెట్టింగ్‌ జోరుగా కొనసాగుతుందనే ప్రచారం వినవస్తుంది. ప్రధాన నగరాలైన ముంబై, హైదరాబాద్‌, వరంగల్‌ , ఆంధ్రప్రదేశ్‌ల నుండి ఎక్కడిక్కడ గ్రూపులు ఏర్పాటు చేసి గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారితో వాట్సప్‌ , ఆన్‌లైన్‌ లింక్‌ల ద్వారా ఈ బెట్టింగ్‌ దందా కొనసాగుతున్నట్లు సమాచారం.

ఒక ప్రాంతానికి చెందిన వారికి లింకు పంపి వారికి అత్యంత నమ్మకమైన వ్యక్తులతో ఈ దందా కొనసాగిస్తున్నారు. రూ.1000 నుండి మొదలై లక్షల్లో బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు బెట్టింగ్‌ లో జిల్లాలో పలువురు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారనే గుసగుసలు వినవస్తున్నాయి. డబ్బు అత్యాశతో అప్పుల పాలవుతున్నారు. ఈ ఐపిఎల్‌ ముగిసే వరకు ఎన్ని కుటుంబాలు ఈ మాయకు బలవుతారోనని పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన జిల్లా టాస్క్‌ఫోర్స్‌, నిఘా విభాగాలు, పోలీసులు ఈ దందా పై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement