Saturday, April 27, 2024

మరో ఇద్దరు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకగా.. అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. తాజాగా మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు వైరస్ సోకింది. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన చాహల్, కృష్ణప్ప గౌతమ్‌లకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

కృనాల్ పాండ్యాకు గత మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతడితో క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్డిక్ పాండ్యా, చాహల్, కృష్ణప్ప గౌతమ్, పృథ్వీషా, మనీష్ పాండే, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లను బీసీసీఐ ఐసోలేషన్‌కు తరలించింది. సోమవారం రాత్రి కృనాల్ పాండ్యాతో కలిసి ఈ 8 మంది భోజనం చేసినట్లు అక్కడి బీసీసీఐ అధికారులు గుర్తించారు. దాంతో మంగళవారమే 8 మందికి ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం, గురువారం జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లకు వీరిని దూరంగా పెట్టారు.

అయితే గురువారం నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో చాహల్, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఇప్పటికే చాహల్‌ క్వారంటైన్‌లో​ ఉండగా.. తాజాగా గౌతమ్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. వీరిద్దరూ కొలంబోలోని మౌంట్ లావినియా హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తోంది. ఈ ఇద్దరు కరోనా బారిన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే టీ-20 సిరీస్‌ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు ఇది భారీ షాక్‌ అనే చెప్పాలి.

ఈ వార్త కూడా చదవండి: టీమిండియా ఘోర వైఫల్యం.. శ్రీలంకదే టీ20 సిరీస్

Advertisement

తాజా వార్తలు

Advertisement