Sunday, May 5, 2024

జగన్ బెయిల్ రద్దు విషయంలో ‘సాక్షి’ మీడియా అత్యుత్సాహం.. సెటైర్లు వేసిన రఘురామ

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. నిజానికి ఈ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసింది కానీ రఘురామ పిటిషన్‌ను కొట్టివేయలేదు. అయితే కోర్టు తీర్పు వెలువడక ముందే ఉదయం 10.53 గంటలకే సాక్షి మీడియాలో దీనికి సంబంధించిన సమాచారం వచ్చిందంటూ ఎంపీ రఘురామ మండిపడ్డారు. ఈ సమాచారం సాక్షి మీడియాకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కోర్టు స్పందన రాకముందే తన పిటిషన్లను కోర్టు తిరస్కరించిందనే వార్తలు సాక్షిలో ఎలా వస్తాయని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ది ఉంటే… ఈ సమాచారాన్ని ఇచ్చిన సాక్షి జర్నలిస్టుతో పాటు సాక్షి మీడియాపై విచారణ జరిపించాలని రఘురాజు డిమాండ్ చేశారు. ఇలాంటి పరిణామాల వల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని చెప్పారు.

పత్రికా రంగానికి సాక్షి చీడపురుగులా పరిణమించిందా? అనే అనుమానాలు ప్రతి ఒక్కరికీ వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారని రఘురామ మండిపడ్డారు. గత రెండున్నరేళ్లలో రూ. 220 కోట్ల నుంచి రూ. 230 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలను సాక్షి పొందిందని అన్నారు. ఎంతో ప్రజాదరణ, ఎంతో ఉన్నతమైన ప్రమాణాలు ఉంటే తప్ప ఇంత పెద్ద మొత్తంలో ప్రకటనలు ఎవరికీ రావన్నారు. ఇలాంటి సాక్షికి జడ్జి సీట్ ఎక్కిన వెంటనే సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సాక్షిలో కథనం వచ్చిన విధంగా… ఒకవేళ న్యాయమూర్తి తన పిటిషన్లను కొట్టేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై సందేహాలు వస్తాయి కదా? అని వ్యాఖ్యానించారు. జడ్జి చెప్పేంత వరకు కూడా ఆగలేరా? అని ప్రశ్నించారు. ఇది మీడియా మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయమని అన్నారు. ఈ అంశంపై తన లాయర్ తో మాట్లాడతానని చెప్పారు. ఇది మా సీఎం జగన్‌కు కూడా అప్రతిష్టేనని అన్నారు. దీనిపై సీఐడీతో కాకుండా మరో మంచి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement