Monday, May 6, 2024

క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే వాతావరణం కావాలి : వెంకయ్యనాయుడు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలో క్రీడాసంస్కృతిని పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ ప్రయత్నంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటుచేసి క్రీడావ్యవస్థలను బలోపేతం చేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆదివారం బెంగళూరులో ‘ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు – 2021’ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు 200 విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన 4,500 మంది యువ క్రీడాకారులను, క్రీడా ప్రముఖులు, ప్రైవేటు రంగం ప్రతినిధులు, ప్రభుత్వాధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసగించారు. విదేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో క్రీడలకు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలో ఇస్తున్న ప్రాధాన్యత, ప్రోత్సాహం ఒలింపిక్స్ లో ఆ దేశం సాధిస్తున్న పతకాల పట్టికలో కనబడుతోందని అన్నారు. ఇదే విధంగా భారత్‌లోనూ విశ్వవిద్యాలయాలు క్రీడాసంస్కృతిని ప్రోత్సహిస్తూ, వివిధ క్రీడల్లో అవసరమైన మౌలికవసతుల కల్పన ద్వారా పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రైవేటు రంగం, సామాజికవేత్తలు, ప్రముఖ క్రీడాకారులు తమవంతు సహకారాన్ని అందించాలని ఆకాంక్షించారు. క్రీడా మౌలికవసతుల నిర్మాణంతోపాటు సామర్థ్యమున్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడం, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ముందుండాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాసామర్థ్యాన్ని వెలికితీసి సానబెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

కేంద్రం ‘ఖేలో ఇండియా’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని ఓ అద్భుతమైన ఆలోచనగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లోని సామర్థ్యాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, అవసరమైన వసతుల కల్పన వంటి చర్యలు చేపడుతోందని తెలిపారు. యోగాసనాలు, మల్లఖంబ వంటి దేశీయ క్రీడలతోపాటు 20 రకాల వివిధ క్రీడలను ఈసారి ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా చేయడంపై అభినందించిన ఉపరాష్ట్రపతి.. భారతీయ క్రీడలను ముఖ్యంగా గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలన్నారు. గ్రామీణ క్రీడల్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు.

క్రీడలు, యోగాను పాఠశాలల పాఠ్యప్రణాళికలో చేర్చడం ద్వారా బాల్యం నుంచే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి, శారీరక, మానసిక సంతులనం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి వంటివి పెంపొందించవచ్చన్నారు. ప్లాస్టిక్ వినియోగం లేకుండా, పునర్వినియోగ వస్తువులను వినియోగించడం కారణంగా ఈ క్రీడలు మొట్టమొదటి గ్రీన్ గేమ్స్ గా నిలిచిపోతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇందుకుగానూ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమ సహ నిర్వాహకులు జైన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ యాజమాన్యాన్ని కూడా ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి డాక్టర్ కేసీ నారాయణ గౌడ, పలువురు ప్రముఖులు, అధికారులు, క్రీడాకారులు, క్రీడా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement