Monday, May 6, 2024

నితీశ్ కుమార్ బిజెపిని వీడింది అందుకే-ప్ర‌శాంత్ కిశోర్

బిజెపి కూట‌మిలో నితీశ్ కుమార్ సౌక‌ర్య‌వంతంగా లేనందునే బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌త్య‌ర్థి కూట‌మిలో చేరార‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ అన్నారు. ఈ పరిణామాలు రాష్ట్రానికే పరిమితమన్న ఆయన.. జాతీయ స్థాయిలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 2017 నుంచి 2022 వరకు నీతీశ్‌ కుమార్ బిజెపితో కలిసి ఉన్నారు. ఎన్నడూ అక్కడ సంతోషంగా ఉన్నట్లు ఆయ‌న కనిపించలేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందుకే మహాకూటమితో ప్రయోగం చేద్దామని భావించి ఉండవచ్చు అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్ తెలిపారు.

ఇక ప్రధాని పీఠంపై నీతీశ్‌ కుమార్‌ గురిపెట్టారని వస్తోన్న వార్తలపై స్పందించిన ఆయన.. ప్రస్తుత పరిణామాలు కేవలం బిహార్‌కే పరిమితమని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి 2012-13 నుంచి ప్రయోగం చేయడం ఇది ఆరోసారి. ఈ ఆరుసార్లు కూడా నీతీశ్‌ కుమార్‌ మాత్రమే ముఖ్యమంత్రి. అయినప్పటికీ బిహార్‌ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వమైనా కొంత మంచి చేస్తుందని ఆశిస్తున్నా అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. అవినీతితోపాటు చాలా అంశాల్లో భిన్నాభిప్రాయాలున్న ఆర్జేడీ, జేడీ(యు)లు ఎటువంటి పాలన చేస్తాయో చూడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement