Wednesday, May 1, 2024

TS | మహిళా బిల్లుపై ఎందుకు నిలదీయలేదు.. కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కవిత

తమ పాలనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పాలించిన 60 ఏళ్ల కాలంలో మహిళల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా? అంటూ ద్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 34 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చారని మండిప‌డ్డారు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని క‌విత ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు వాడుకుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే త‌మ డిమాండ్ పై వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదనగా కవిత పేర్కొన్నారు.

రాజ్యంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలి. దానికి చిత్తశుద్దితో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.తాను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement