Saturday, May 4, 2024

Water War – ప్రాజెక్ట్ ల‌పై కాంగ్రెస్ అస‌త్య ప్రచారాలు … 13న న‌ల్గొండ‌లో కెసిఆర్ బ‌హిరంగ స‌భ‌

హైద‌రాబాద్ – సాగు నీటి ప్రాజెక్టుల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అస‌త్య ప్ర‌చారాల‌ను చేస్తున్న‌ద‌ని, వాస్త‌వాల‌ను ప్ర‌జా క్షేత్రంలో ఎంట‌గ‌ట్టాల‌ని బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు ఇచ్చారు.. ప్ర‌తి ప్రాజెక్ట్ పై అధికారంలో ఉన్న స‌మ‌యంలో శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేశామ‌ని గుర్తు చేశారు.. బిఆర్ఎస్ ప్ర‌భుత్వం నీళ్ల సాధ‌న‌కోసం చేసిన పోరాటాల‌ను, నిర్మించిన ప్రాజెక్ట్ ల‌ను, వాటి ద్వారా పొందుతున్న ల‌బ్ధిని విసృతుత స్థాయిలో ప్ర‌జ‌ల‌లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు.. కాంగ్రెస్ పార్టీ నేత‌లు గ‌త‌ ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నిస్తే వెంట‌నే దానికి కౌంట‌ర్ ఇవ్వాల‌ని సూచించారు..కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించిన విషయంలో కాంగ్రెస్ పై భారీ ఉద్య‌మానికి సిద్దం కావాల‌నే మెజార్టీ స‌భ్యుల అభిప్రాయంతో కెసిఆర్ ఏకీభ‌వించారు.. ఈ నేప‌థ్యంలోనే కేఆర్‌ఎంబీపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణ సిద్దం చేయాల‌ని సీనియ‌ర్ నేత‌ల‌కు బాద్య‌త‌లు అప్ప‌గించారు కెసిఆర్ .

13న న‌ల్గొండ‌లో భారీ బ‌హిరంగ స‌భ ..
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబి కి అప్పగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ…కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు…
ఈనెల 13 న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని ఈ స‌మావేశంలో స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణ ను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తి తోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబి కి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని., కాంగ్రేస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నామని., ప్రజా క్షేత్రం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బిఆర్ఎస్ అధినేత ప్రకటించారు.

ప‌దేళ్లు కాపాడుకున్నాం…. ప‌ది రోజుల‌లో అప్ప‌గించేశారు..

“మా నీళ్లు మాకే “ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలం లోనే నిజం చేసి చూయించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేఆర్ఎంబి పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణ కున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ కాంగ్రేస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం తో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీన్ని ప్రజా మద్దతు తో తిప్పికొడుతామన్నారు. తద్వారా హైదరాబాద్ రంగారెడ్డి,నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
హ‌క్కుల కోసం పోరాడాల్సిందే … తీర్మానం ఆమోదం
కాంగ్రేస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరి ని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణ కు రావలసిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది.

ఇది ఇలా ఉంటే బీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్‌ సమీక్షించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో దానిని గురించి సుదీర్ఘంగా చ‌ర్చించి, తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

- Advertisement -

ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి,సబితా ఇంద్రా రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్,తోపాటు ఎమ్మెల్యే లు ఎంఎల్సీలు ఎంపీలు జెపి చైమన్లు కార్పొరేషన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు…తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement