Tuesday, May 21, 2024

Follow up | హస్తినలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’.. ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని న్యూఢిల్లీ ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ జపిస్తోంది. నగరంలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్‌లో ఏర్పాటైన “బుద్ధం శరణం గచ్చామి” ఎగ్జిబిషన్‌ను కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి  మీనాక్షి లేఖి బుధవారం ప్రారంభించగా, ఈ కార్యక్రమానికి డ్రెపుంగ్ గోమాంగ్ ఆశ్రమానికి చెందిన కుండెలింగ్ తత్సక్ రింపోచే గౌరవ అతిథిగా హాజరయ్యారు. బౌద్ధ సన్యాసులు, రాయబారులు, దౌత్యవేత్తలు,మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బుద్ధ భగవానుడి జీవితం ఆధారంగా రూపొందిన ఎగ్జిబిషన్ బుద్ధ పూర్ణిమ తర్వాత ఏర్పాటవడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు. బుద్ధ భగవానుడి జీవిత చరిత్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ కళ, సంస్కృతికి ఉన్న గుర్తింపు, గౌరవం గుర్తు చేసేలా ప్రదర్శన ఏర్పాటయింది. ఆధునిక భారతీయ కళారంగంలో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన వ్యక్తులు రూపొందించిన కళాకృతులను ఇందులో ప్రదర్శిస్తున్నారు. బౌద్ధ మతం, బుద్ధుని జీవితం ఘట్టాలను ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచారు. ఈ కళారూపాలు బౌద్ధమతం చరిత్ర, తత్వశాస్త్రంలో బౌద్ధమతం ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.

- Advertisement -



సీనియర్ బౌద్ధ భిక్షువుల మంత్రోచ్ఛారణల మధ్య జ్యోతి ప్రజ్వలన, అంగవస్త్ర సమర్పణతో ప్రదర్శన ప్రారంభమైంది. కవితా ద్వివేది తన బృందంతో కలిసి ఒడిస్సీ నృత్య శైలిలో మోక్షంలో మహిళ ప్రాముఖ్యతను తెలియజేస్తూ “శ్వేతా ముక్తి” ప్రదర్శన ఇచ్చారు. వివిధ దేశాలకు చెందిన బౌద్ధ సంఘాల అధిపతులు, ప్రతినిధులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి గణనీయమైన బౌద్ధ జనాభా ఉన్న నేపాల్, మయన్మార్, మంగోలియా, దక్షిణ కొరియా, థాయిలాండ్, భూటాన్ మొదలైన  దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

కార్యక్రమంలో  డెన్మార్క్, గ్రీస్, లక్సెంబర్గ్, జమైకా, పోర్చుగల్, జార్జియా, ఐస్‌లాండ్, ఈక్వెడార్, సిరియా, పెరూ తదితర దేశాలకు చెందిన రాయబారులు, సీనియర్ దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు. శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలకు చెందిన పెయింటింగ్‌లను ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచారు. వివిధ దేశాలకు బౌద్ధమతం వ్యాపించిన తీరును పెయింటింగ్‌ల ద్వారా చూపించారు. బౌద్ధ మతానికి సంబంధించిన వివిధ అంశాలు, కళ, ఆధ్యాత్మిక, జ్ఞానం, కరుణ, శాంతి సార్వత్రిక విలువలను పెయింటింగ్‌ల ద్వారా తెలియజేయాలన్న లక్ష్యంతో  ఎగ్జిబిషన్ ఏర్పాటయింది.

దిగ్గజ భారతీయ కళాకారుడు నందలాల్ బోస్ బుద్ధుని జీవితం, బోధనలు, ఆధ్యాత్మికత  మార్గాన్ని లైన్ డ్రాయింగ్‌ల ద్వారా ఆకట్టుకునే విధంగా  రూపొందించారు. నికోలస్ రోరిచ్, బీరేశ్వర్ సేన్ పెయింటింగ్ ల ద్వారా ప్రకృతి రమణీయమైన హిమాలయాలను తీర్చిదిద్దారు. కార్యక్రమానికి హాజరైన దౌత్య సిబ్బంది  బుద్ధుని జీవితం, బుద్ధుడు బోధించిన విలువలు ప్రతిబించించే విధంగా  ఎగ్జిబిషన్ ఉందని పేర్కొన్నారు. ప్రజల సందర్శనార్థం ఈ ప్రదర్శనను జూన్ 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement