Monday, April 29, 2024

Delhi | మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ అఖిలపక్ష సమావేశం.. బీఆర్‌ఎస్ తరఫున పాల్గొన్న వినోద్ కుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన హాజరయ్యారు. సమావేశం అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తాము ఢిల్లీలో ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల రాజకీయ పార్టీలు, సంఘాలు మమ్మల్ని కలిసేవారని, ఈ అంశంపై తమకు కొంత అవగాహన ఉందని చెప్పారు.

మణిపూర్ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు భరోసా, ధైర్యం కల్పించే బాధ్యత ఉందని అఖిలపక్ష సమావేశంలో చెప్పామని ఆయన వెల్లడించారు. కారణాలు తెలియనప్పటికీ 1990 నుంచి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని, కుకిలు, నాగలుా ఉన్న చోట తమను ఎస్టీల్లో చేర్చాలని మెయితెయిలు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎవరినైనా ఎస్టీల్లో చేర్చాలంటే ఆ హక్కు పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందన్నారు. కానీ మణిపూర్ హైకోర్టు 4 వారాల్లో మెయితెయిలను ఎస్టీల్లో చేర్చాలని తీర్పు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదన్న ఆయన, ఒకవేళ స్టే ఇచ్చి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగపోయి ఉండేదని సమాచారం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.

- Advertisement -

ఘర్షణల కారణంగా నిర్వాతులైన వేలాది మందికి కేంద్రం వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. 50 రోజులు ఇంటర్నెట్ నిషేధించడం మంచిది కాదని తాము కేంద్ర ప్రభుత్వానికి చెప్పామని ఆయన వెల్లడించారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధించాలని కోరామన్నారు. ఇంత జరిగినా ఇప్పటివరకు ప్రధాని స్పందించకపోవడం మంచి పద్ధతి కాదని ఆయన విమర్శించారు. 13 ఏళ్ల క్రితం కాశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆనాడు హోంశాఖ మంత్రి చిదంబరం నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగిందని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు అన్ని పార్టీలను తీసుకెళ్లారని ఆయన చెప్పారు. నేటి సమావేశంలో తాము చేసిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని చెప్పారని వినోద్ కుమార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement