అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతి రాజధాని భూసమీకరణ రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలును విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరానికి రూ. 240 కోట్లు విడుదల చేసినట్లు రాజధాని ప్రాంత ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం తెలిపారు. అమరావతిలో 20వేల 870 మంది రైతులకు ఇప్పటి వరకు 24,149 ఎకరాలకు సంబంధించి 156కోట్ల 24 లక్షలు కౌలు చెల్లింపునకు ప్రతిపాదనలు అందాయి. ఇప్పటి వరకు 16వేల 395 మంది భూ యజమానులకు 18వేల 755 ఎకరాలకు 120కోట్ల 56 లక్షలు చెల్లించేందుకు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు.
వీరిలో 124 మంది అసైన్డు రైతులు కూడా ఉన్నారు. వీరికి 98 లక్షల 30వేలు జమ చేయనున్నట్లు కమిషనర్ వివరించారు. ఈ నెలాఖరులోగా సీఎఫ్ఎంఎస్ ద్వారా రైతులకు కౌలు చెల్లింపులు అప్లోడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ కట్టా సింహాచలం,ప్రత్యేక కలెక్టర్ టీ చిరంజీవి పర్యవేక్షణలో సంబంధిత కాంపిటెంట్ అధికారులు కౌలు చెల్లింపులకు కసరత్తు జరుపుతున్ాు. అర్హులైన రైతులకు వార్షిక కౌలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. చెల్లింపులపై సందేహాలు ఉంటే తుళ్లూరు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నివృత్తి చేసుకోవాలని కోరారు.