Thursday, April 25, 2024

Big Story | భూగర్భంలో పెరిగిన జలసిరులు, పాతాళంలో 680టీఎంసీల నీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వందల గజాలలోతు బోరులువేసినా నీరు లేని పరిస్థితిని తెలంగాణ అధిగమించింది. రాష్ట్రజలవిధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. భూగర్భంలో పాతాళ గంగ పొంగిపొరలుతూ సగటున 4.26 మీటర్ల ఎత్తుకు భూగ్భ జలమట్టం చేరుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన జలవిధానాలు, నిర్మించిన ప్రాజెక్టులు భూగర్భ జలాలను పెంచడంతో పాటుగా ప్లోరోసిస్‌ను కూడా క్రమేణ తగ్గిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో ఉపరితలంలో నీటి ఎత్తిపోతలతో పాటుగా వరుణి కటాక్షంతో ఉపరితలంతో పాటుగా భూగర్భంలో జలం సిరులై ప్రవహిస్తుంది. తెలంగాణ ఆవిర్భవించిన అనతికాలంలోనే భూగర్భజలాలు పైపైకి వస్తుండటంతో పాటుగా వందల టీఎంసీల నీరు భూగర్భంలో సిద్ధంగా ఉంది.

- Advertisement -

భూగర్భజలాల పెరుగుదలలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులంతా దాదాపుగా ఉపరితల నీటియోగంతో వ్యవసాయాన్ని పండుగగా చేస్తున్నారు. పెరిగిన భూగర్భజలాలు, నిర్మించిన ప్రాజెక్టులతో 40 లక్షల ఎకరాల సాగునుంచి కొటి 25లక్షల సాగుకు తెలంగాణ రైతాంగం చేరుకుని చరిత్ర సృష్టిస్తుంది. తెలంగాణ డైనమిక్‌ గ్రౌండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ నివేదిక మేరకు తెలంగాణ పరిధిలోని భూగర్భంలో ప్రస్తుతం 680 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. గతంలో అడుగంటిన జలవనరులు ప్రస్తుతం పైకి చేరుకున్నాయని తెలిపారు. అయితే దీనికి ప్రధాన కారణం రైతులు బోరుపంపుల వినియోగం తగ్గించి ఉపరితల నీటి వినియోగం పెంచడమేనని నిపుణులు తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు కేటాయించిన నీరు 299 టీఎంసీలైతే తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో భూగర్భంలో మనం పొదుపుగా దాచుకున్న నీరు 680 టీఎంసీలు.

ఈ నీటితో మూడు పంటలు సులువుగా పండించవచ్చని జల నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాల వినియోగం తగ్గడం, వర్షపాతం పెరగడం, సాగునీటి కాలువల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణాలు భూగర్భ జలాల పెరుగుదలకు ప్రేరకాలుగా నిలిచాయి. బోర్లనుంచి క్రమేణ రైతులు పక్కకు వచ్చి బావులు, కాలువలకు మోటర్లు బిగించి నీటిని తోడుకునే వ్యవస్థ ఉన్నతంగా నిలిచింది. రాష్ట్రంలోని 83 మండలాల్లో ఈ పెరుగుదల అధికంగా అగుపిస్తుంది.

కాతీయులు నిర్మించిన చెరువుల్లో 26వేల 700 చెరువుల పునరుద్ధరణ, కుంటలు, చిన్న చెరువులు, నీటీ ఊటల పునరుద్ధరణ ప్రేరకాలుగా నిలిచాయి. అలాగే 1,375 చెక్‌ డ్యాంల నిర్మాణాలతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీటి పోదుపు తదితర అంశాలు తెలంగాణలో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రధాన అంశాలుగా నిలిచాయి. అయితే నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే భూగర్భజలాలు మరింతగా అందుబాటులో ఉండటంతో పాటుగా నీటి ఊటలు పెరిగే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని జలనిపుణులు అంచనావేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement